Brij Bhushan

విధాత‌: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌.. ఆదివారం తొలిసారి బల ప్రదర్శన చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గంలో బహిరంసభలో మాట్లాడిన బ్రిజ్‌భూషణ్.. ప్రధాని మోదీ విధానాలను అమలు చేసేందుకు తన కృషిని కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. రాబోయే 2024 ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. కోర్టు ఉత్తర్వుల కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. లైంగిక వేధింపుల కేసులో రాజకీయంగా బలమైన రక్షణ పొందుతున్నారని బ్రిజ్‌భూషణ్‌పై విమర్శలు ఉన్నాయి.

అయితే.. అరెస్టు చేసే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఆయనలో కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.