BRS
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి ఎన్ని’కలల’ సాధన సంబరాలుగా నిర్వహించేందుకు ఆ పార్టీ అధిష్టానం బృహత్ ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ 27న కాకుండా ముందుగానే ఏప్రిల్ 25న ఈ సంబురాలను నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అనగా ఏప్రిల్ 25న నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించి ప్రజలపై పార్టీ కేడర్పై గట్టి ఇంపాక్ట్ పడేవిధంగా అధిష్టానం ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అందజేశారు.
ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు నిమగ్నం
ఈ నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒకే రోజు సంబురాలు నిర్వహించడమే కాకుండా ఈ ప్లీనరీలలో కేడర్ కు బహుముఖ కర్తవ్యాలను అందించనున్నారు. ముఖ్యంగా త్వరలో రాష్ట్రములో ఎన్నికలు జరగనున్నందున, ఆ ఎన్నికలకు ముందస్తుగా కేడర్ను సంసిద్ధం చేసే సభలుగా వీటిని నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
సాధారణ ప్రజలపై ఈ సమావేశాల సందర్భంగా జరిగే సంబరాలు ప్రత్యేక ముద్ర వేసే విధంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి కావచ్చాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇంచార్జిలు ఇప్పటికే సంబంధిత సమావేశాలను కూడా పూర్తిచేసి కార్యక్రమములో నిమగ్నమయ్యారు.
గులాబీమయం చేయడం లక్ష్యం
ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కేడర్ మనోభావాలతో పాటు, పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందించేందుకు చర్యలు తీసుకుంటూనే అవసరమైన చోట లోటుపాట్లను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగించారు.
తాజాగా నియోజకవర్గ సంబురాల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉండేలా గులాబీ మయం చేయాలని సూచించారు. BRS తోరణాలు, ఫ్లెక్సీలు కట్టాలని, గ్రామ గ్రామాన పార్టీ గద్దెలకు రంగులద్దాలి. ఉదయం జెండాలు ఆవిష్కరించాలి.
గ్రామస్థాయి నిర్మాణ పటిష్టత
ఇందులో ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో పాటు పార్టీకి చెందిన అన్ని విభాగాల నేతలను, కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలి. అలాగే పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలి. మహిళలు సహా, విద్యార్థి యువజన రైతు కార్మిక ఇతర అనుబంధ సంఘాలను కలుపుకుపోవాలి. పార్టీ నిర్మాణాత్మకంగా పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ప్లీనరీ సందర్భంగా పార్టీ గొప్ప తనాన్ని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి. అంశాల వారీగా నేతలు ఉప న్యాసాల ద్వారా వివరించాలని సూచించారు.
సోషల్ మీడియాపై ఫోకస్
సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని కేడర్కు ఇప్పటికే చెప్పినప్పటికీ మరోసారి ఈ విషయంపై అవగాహన కల్పించనున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పి కొట్టి ప్రజలను తమ వైపు గెలుచుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు.
టార్గెట్.. కేంద్ర ప్రభుత్వం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ మోస పూరిత వైఖరిని ప్రజలకు వివరించాలి. BJP నాయకుల తీరుని ఎండగడుతూనే ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ తీర్మానాలు చేయాలని, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యాన్ని ఎత్తి పడుతూ కేంద్రాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించారు.
ప్లీనరీకి భారీ బలగం
ఈ ప్లీనరీ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, 3వేల మందికి తగ్గకుండా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ బలగమంతా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందించే విధంగా ఈ ప్లీనరీలు జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు ముందస్తు దిశానిర్దేశం చేయనున్నారు.