బీఅరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఅరెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
విధాత : బీఅరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఅరెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఆదివారం వారు స్పీకర్ ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన సమయం ఇవ్వకపోవడంతో సోమవారం స్పీకర్ను కలిసి ఫిర్యాదు అందించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్ సహా ఆ పార్టీ శాసససభ పక్ష బృందం స్పీకర్ ప్రసాద్ ను కలిసి నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది.
అయితే కాంగ్రెస్ లోకి ప్రస్తుతం బీఅరెస్ ఎమ్మెల్యేల నుంచి దానం నాగేందర్ ఒకరే చేరారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా బీఅరెస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దఫాల వారీగా బీఅరెస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేవరకు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ల ను పెండింగ్లోనే పెట్టె ప్రయత్నం కాంగ్రెస్ చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతంలో బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహాలో కాంగ్రెస్, టిడిపి లను చీల్చగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ బీఅరెస్ ను దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. బీఅరెస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలలో 26 మంది కాంగ్రెస్లో చేరాక బీఅరెస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినట్లుగా ప్రకటించే వ్యూహంతో కాంగ్రెస్ ఉందని తెలుస్తుంది.
నిజానికి అనర్హత ముప్పును తప్పించేలా బీఅరెస్ నుంచి ఒకేసారి భారీగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించినప్పటికీ ఆలస్యం అవుతున్న కొద్దీ బిజెపి వారిని లాక్కునే ప్రమాదం ఉండటంతో కాంగ్రెస్ వలసలకు గేట్లు తెరవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదికాక పార్లమెంట్ ఎన్నికలకు ముందు వారి చేరికతో ఎన్నికల్లో కొంత గెలుపు అవకాశాలు కూడా పెరుగుతాయని కాంగ్రెస్ భావిస్తుంది.