MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో అరెస్టు అయిన సమీర్ మహేంద్రు విషయంలో కోర్టుకు దాఖలు చేసిన ఛార్జీషీటులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, శరత్చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ ఛార్జీషీట్ను ఈడీ రూపొందించింది.
చార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న వివరాల ప్రకారం.. మాగుంట రాఘవ్రెడ్డి, కవిత అసలు భాగస్వాములుగా ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థ 14,05,58,890 సీసాల మద్యం విక్రయించి రూ. 192.8 కోట్లు సంపాదించింది. శ్రీనివాసులు రెడ్డి, శరత్రెడ్డి, రాఘవ్రెడ్డి, కవిత నియంత్రణలో ఉన్న సౌత్గ్రూప్ ఆప్ నాయకుల కోసం విజయ్నాయర్కు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చింది. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు ఇండోస్పిరిట్లో 65 శాతం వాటాను సౌత్గ్రూప్నకు ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో అరుణ్పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో సౌత్గ్రూప్ ఇండోస్పిరిట్లోని వాటాను నడిపింది. అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు.
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్లోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అరుణ్ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్కు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 10 వేల కోట్ల ఆదాయం ఉందని అరుణ్ పిళ్లైతో ఆప్ బినామీ విజయ్నాయర్ చెప్పారు. పెద్ద తలకాయల కోసం చూస్తున్న సమయంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంపై ఆసక్తి చూపారు. ఆర్థిక వనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం బుచ్చిబాబును ఆయన ఇందులోకి తీసుకొచ్చారు.
కాగా, సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిన్న విచారణ చేపట్టగా సమీర్ విచారణకు హాజరయ్యారు. చార్జిషీట్లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5లోపు చెప్పాలని ప్రతివాదులైన సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది.
రాజగోపాల్ అన్న తొందరపడకు.. మాట జారకు: ఎమ్మెల్సీ కవిత
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ తాజాగా ఛార్జీషీట్ దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. దీనిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్విటర్లో స్పందించారు.
లిక్కర్ క్వీన్ పేరును ఈడీ 28 సార్లు రాసుకొచ్చిందన్నారు. దీనిపై కవిత గట్టిగా బదులిచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు.. మాట జారకు అన్నారు. 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదన్నారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022