విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. కవిత ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. ఆమె కస్టడీ ఈనెల 23వరకు ఉంది. కవితను జైలులోనే అరెస్టు చేసినట్లుగా సీబీఐ వెల్లడించింది. కవితను ఇదే కేసులో మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కవిత కోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. కోర్టులో కవిత పిటిషన్ విచారణకు ఉందన్న విషయం తెలిసి కూడా జైలులోనే కవితను సీబీఐ అరెస్టు చేయడం కీలక పరిణామంగా మారింది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సైతం ఈనెల 16న విచారణకు రానుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు గత ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని అంతకునాలుగు రోజుల ముందు సీబీఐ 41ఏ కింద నోటీస్లు జారీ చేసింది. గతంలో సాక్షిగా విచారించిన సీబీఐ ఈ దఫా నిందితురాలిగా నోటీస్లో పేర్కోంది. అనంతర పరిణామాల మధ్య కవితను ఈడీ హైదరాబాద్లో మార్చి 15న అరెస్టు చేసింది. అంతకుముందు 2022డిసెంబర్ 11న కవితను సీబీఐ హైదరాబాద్లో విచారించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో ఇప్పటికే ఒక పర్యాయం సీబీఐ విచారించింది. బుచ్చిబాబు ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా సీబీఐ కవితను ప్రశ్నించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల వ్యవహారంపై, కవిత కొనుగోలు చేసిన భూములపైన సీబీఐ ఆమె నుంచి వివరాలు రాబట్టింది. అలాగే ఈడీ సేకరించిన ఆధారాల మేరకు కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించింది. మరింత విచారణ నిమిత్తం కవితను సీబీఐ అరెస్టు చేసింది.