Gutta Sukhender Reddy | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: అధికార బలంతో కాంట్రాక్టర్లు పొందారంటూ తమపై కోమటిరెడ్డి అబద్ధపు ఆరోణలు చేస్తున్నాడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ మా వియ్యంకుడు మొదటి నుంచి కాంట్రాక్టర్ అని, అందులో భాగంగానే గందమల్ల రిజర్వాయర్ కాంట్రాక్టు లభించిందన్నారు. రాజకీయ ఆసహనంతో కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీనియర్ నేతగా చెప్పుకునే వెంకటరెడ్డికి రాజకీయ పరిణితి లేదని, ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే బెటరని గుత్త ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరుచూ తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. గాలి మాటలతో ప్రజలను కాంగ్రెస్ నేతలు ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని విమర్శించారు. పీసీసీ చీఫ్ ఒక మాట చెబితే వాటికి విరుద్ధంగా సీనియర్లు తలో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లోనే ఐక్యత లేదని ఇంకా వారికి అధికారం వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని, వీళ్లా ప్రజల బాగోగుల గురించి మాట్లాడేది అని చురకలేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం ఉండదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏ హోదా ప్రజాప్రతినిధులైన సహనం, సమయమనంతో పని చేయాలన్నారు. టికెట్ల ఆశావహులకు అస్సలు ఓపిక లేకుండా పోయిందన్నారు. పదవులు ఆశించే వాళ్లంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ లోపే పూర్తవుతుందన్నారు.