Cyclone Viparyay‌ | విపర్యయ్‌ విలయం.. విధ్వంసం అంచున గుజరాత్‌

Cyclone Viparyay‌ | నేడు తీరం దాటనున్న తుఫాను రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటన రైళ్లు రద్దు.. స్కూళ్లకు సెలవులు 8 రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం అహ్మదాబాద్‌: అతి తీవ్ర తుఫాను విపర్యయ్‌.. గుజరాత్‌లో విలయం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌ తీర ప్రాంతాలైన కచ్‌, ద్వారక, సౌరాష్ట్రలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బుధవారం నుంచే విపర్యయ్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసి.. అప్రమత్తం చేసింది. దీని కారణంగా ఎనిమిది రాష్ట్రాల్లో […]

  • Publish Date - June 14, 2023 / 11:14 AM IST

Cyclone Viparyay‌ |

  • నేడు తీరం దాటనున్న తుఫాను
  • రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటన
  • రైళ్లు రద్దు.. స్కూళ్లకు సెలవులు
  • 8 రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం

అహ్మదాబాద్‌: అతి తీవ్ర తుఫాను విపర్యయ్‌.. గుజరాత్‌లో విలయం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌ తీర ప్రాంతాలైన కచ్‌, ద్వారక, సౌరాష్ట్రలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బుధవారం నుంచే విపర్యయ్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసి.. అప్రమత్తం చేసింది.

దీని కారణంగా ఎనిమిది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా పయనించి.. గురువారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నది. ఆ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నదని, గాలిదుమారం గంటకు 150 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందున గుజరాత్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల నుంచి దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అనేక మార్గాల్లో రైళ్లు రద్దయ్యాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తీవ్ర తుఫాను నుంచి అతి తీవ్ర తుఫానుగా మారిన విపర్యాయ్‌.. గురువారం సాయంత్రం జఖు రేవు సమీపంలో తీరం దాటం వచ్చని భావిస్తున్నారు.

తీరం దాటిన తర్వాత విపర్యాయ్‌ బలహీనపడుతుందని, ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో 17వ తేదీ వరకూ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గుజరాత్‌తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా, డామన్‌ డియూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీని కూడా ఐంఎడీ అప్రమత్తం చేసింది.