Artificial Intelligence విధాత: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధి వైపు సాగుతున్న మానవాళి.. ఆ అభివృద్ధి కారణంగా ఎన్నో పర్యావరణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐకి మనం చెల్లించే విలువ భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ, దానికి పోటీగా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికాలోని ఐవో రాష్ట్రంలో ఉన్న రకూన్, డెస్ మోయిన్స్ నదుల నీటిని అమితంగా వాడేస్తున్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. […]
Artificial Intelligence
విధాత: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధి వైపు సాగుతున్న మానవాళి.. ఆ అభివృద్ధి కారణంగా ఎన్నో పర్యావరణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐకి మనం చెల్లించే విలువ భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ, దానికి పోటీగా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికాలోని ఐవో రాష్ట్రంలో ఉన్న రకూన్, డెస్ మోయిన్స్ నదుల నీటిని అమితంగా వాడేస్తున్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
తమ ఏఐ వ్యవస్థలను నిరంతరం ఆన్లో ఉంచడానికి, ఆ సూపర్ కంప్యూటర్లను చల్లబరచడానికి నీరు పెద్ద మొత్తంలో ఎల్లపుడూ అవసరం కావడంతో ఈ సంస్థలు ఇష్టం వచ్చినట్లు నది నీటిని తోడేస్తున్నాయని పేర్కొంది. తమ తమ ఏఐ వ్యవస్థలను ఆధునీకరించడానికి పోటీ పడుతున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, ఇతర సంస్థలు కృత్రిమ మేథ వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని మాత్రం చెప్పడం లేదని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ స్వయంగా తన నివేదికలో చెప్పిన దాని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ నీటి వినియోగం 2021 నుంచి 2022 మధ్య 34 శాతం పెరిగింది. దీని ప్రకారం మైక్రోసాఫ్ట్ 1.7 బిలియన్ గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఈ భారీ పెరుగుదలకు కారణం ఆ సంస్థ ఏఐ పరిశోధన, రూపకల్పనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే. ఇదే నేపథ్యంలో గూగుల్ కూడా తన నీటి వినియోగంలో 20 శాతం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అంచనా ప్రకారం ఒక యూజర్ చాట్ జీపీటీ లేదా ఏ ఏఐ సైట్ ను ఉపయోగించినా ఒక సెర్చ్కు 500 మి.లీ. నీరు ఖర్చవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రోజూ ఏఐని ఉపయోగిస్తుండగా నీటి వినియోగం ఏ స్థాయిలో అవుతోందో ఊహించొచ్చు. వేసవి కాలంలో అయితే ఈ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే పేదలు, బలహీన వర్గాల ప్రాంతాలకు వెళ్లే నీటి సరఫరాకు కోత విధించి కృత్రిమ మేథ సంస్థలకు మళ్లించడం వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు.
ప్రస్తుతం ఐవో రాష్ట్రంలో పరిస్థితిని తీసుకుంటే గత ఏడాది వేసవిలో ఆ రాష్ట్ర జనాభా వినియోగించిన మొత్తం నీటి సరఫరాలో 6 శాతం ఒక మైక్రోసాఫ్టే వాడేసింది. అయితే చాలా మందికి కృత్రిమ మేధ వల్ల పర్యావరణంపై పడే ప్రభావం గురించి తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు.