Site icon vidhaatha

Bird Flu: ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ వైరస్ మరణం..రెండేళ్ల చిన్నారి మృతి!

విధాత : ఆంధ్రప్రదేశ్‌లో తొలి బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్‌ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ H5N1 వైరస్‌తో మరణించినట్టుగా భారత వైద్య పరిశోధన మండలి(ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతోనే చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు వెల్లడించారు. బర్డ్‌ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది.

జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని లక్షణాలతో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్‌లో నరసరావుపేట చిన్నారిని చేర్చారు ఆమె కుటుంబసభ్యులు. ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా.. మార్చి 16న తుదిశ్వాస విడిచింది. ఇక చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్ వీఆర్డీఎల్లో పరీక్ష చేయించగా.. బర్డ్ ఫ్లూ వైరస్ అనే అనుమానం రావడంతో.. ఆ శాంపిల్స్‌ను మార్చి 15న ఢిల్లీకి పంపించారు. అక్కడ నివేదిక కూడా బర్డ్‌ఫ్లూ‌నేమోనని అనుమానం రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. మార్చి 24న స్వాబ్ నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపించింది.

దీంతో ఈ రెండు ల్యాబ్స్‌లో నమూనాలను క్షుణ్ణంగా చెక్ చేయగా.. చిన్నారికి సోకింది హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్ధారణ అయింది. ఇంట్లో కోడికూర కోసే సమయంలో పాప అడిగిందని ఓ చిన్న పచ్చి మాంసం ముక్క ఇచ్చామని.. ఆ మాంసం తిన్న కొద్దిసేపటికే చిన్నారికి అనారోగ్యం బారిన పడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్న చికెన్ ముక్క పాప మరణానికి కారణం అవుతుందనుకోలేదని పేరెంట్స్ కన్నీరు పెట్టారు. ఉడికించిన మాంసం తిన్న తమకు ఏమీ కాలేదని అధికారులకు తల్లితండ్రులు వివరణ ఇచ్చారు. బర్డ్ ఫ్లూ వైరస్ మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని ఈ ఘటనకు నిదర్శనంగా మారింది. కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యశాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారించుకున్నారు. పల్నాడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదన్న అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version