బ్లూమ్బర్గ్ క్వింట్ను కొనుగోలు చేసిన ఏఎంజీ బీక్యూ ప్రైమ్గా పేరు మారిన సంస్థ ప్రజాస్వామ్యానికే పరిహాసమంటున్న నిపుణులు Adani । విమానయాన సంస్థలు, ఓడరేవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు - పంపిణీ విభాగాలు, బొగ్గు కంపెనీలు, సహజవాయువు పంపిణీ నెట్వర్క్లు.. ఒకటేమిటి దేశంలోని వ్యాపార రంగాలన్నింటినీ దిగమింగుతున్న వ్యాపార బకాసుర సంస్థ.. అదానీ కంపెనీ.. తాజాగా మరో మీడియా సంస్థను కబళించింది. క్వింటిలియన్ బిజినెస్ మీడియా అనే సంస్థలో 48 కోట్ల రూపాయలు పెట్టి 49 శాతం […]
Adani । విమానయాన సంస్థలు, ఓడరేవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు – పంపిణీ విభాగాలు, బొగ్గు కంపెనీలు, సహజవాయువు పంపిణీ నెట్వర్క్లు.. ఒకటేమిటి దేశంలోని వ్యాపార రంగాలన్నింటినీ దిగమింగుతున్న వ్యాపార బకాసుర సంస్థ.. అదానీ కంపెనీ.. తాజాగా మరో మీడియా సంస్థను కబళించింది. క్వింటిలియన్ బిజినెస్ మీడియా అనే సంస్థలో 48 కోట్ల రూపాయలు పెట్టి 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. తమ మీడియా విభాగం ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ తాజాగా క్వింటిలియన్ వాటా కొన్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రకటించింది. ఈ తతంగం అంతా గత ఏడాదిలోనే సాగినప్పటికీ తాజాగా ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజిలో వివరాలను దాఖలు చేసింది. మార్చి 27న లావాదేవీలు ముగిశాయని తెలిపింది.
విధాత : రాఘవ్ బహల్ అధీనంలోని డిజిటల్ న్యూస్ సంస్థ బ్లూమ్బర్గ్ క్వింట్ (Quintillion Business Media Pvt Ltd) అనే డిజిటల్ వార్తా సంస్థను నడుపుతున్నది. దీనిని అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises Ltd) కొనుగోలు చేసింది. దీంతో ఇకపై దీనిని బీక్యూ ప్రైమ్గా వ్యవహరిస్తారు. ఇటీవలే ఎన్డీటీవీ సంస్థను అదానీ దొడ్డిదోవన కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అదానీ గ్రూప్ మీడియా సంస్ధ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (AMG Media Networks) ప్రచురణ, అడ్వర్టయిజింగ్, బ్రాడ్కాస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ తదితర దాదాపు అన్ని రంగాల్లో అడుగు పెట్టింది. అదానీ గ్రూప్ అడుగు పెట్టడంతో అమెరికా కేంద్రంగా ఉండే బ్లూమ్బర్గ్ మీడియా ఇందులోంచి నిష్క్రమించింది. ఇంతకాలం బ్లూమ్ బర్గ్ మీడియా క్యూబీఎంతో కలిసి భారత్లో బ్లూమ్బర్గ్ క్వింట్ను నిర్వహించేది. ఇప్పుడు ఈ ఈక్విటీ జాయింట్ వెంచర్లు ముగించినట్టు వెల్లడించింది. అయితే బ్లూమ్బర్గ్ వాటానే అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందా? అనే స్పష్టత ఇవ్వలేదు.
గతంలో ఎన్డీటీవీ (NDTV)ని అదానీ గ్రూపు చేజిక్కించుకున్నప్పుడు దేశమంతా ఆందోళన వ్యక్తమైంది. నిజాయితీతో కూడుకున్న వార్తా ప్రసారాలలో ఎన్డీటీవీ ఎంతో పేరు తెచ్చుకున్నది. వాస్తవాలను తెలుసుకోవడానికి వీక్షకులు ఎన్డీటీవీని నమ్ముకునే వారు. కానీ అదానీ గ్రూప్ గత ఏడాది డిసెంబర్లో ఈ కంపెనీని తమ గుప్పెటలోకి తెచ్చుకున్నది. దీనివల్ల ఈ వార్తా సంస్థ స్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికారాయ్ గొంతు మూగబోయింది. వారు ఆ సంస్థ నుంచి వైదొలిగారు.
మోదీ ప్రభుత్వంతో అంటకాగే మరో వ్యాపార సంస్థ ముఖేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కూడా న్యూస్ 18నెట్వర్క్తో పాటు పలు టీవీ న్యూస్ చానళ్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను నిర్వహిస్తున్నది. ఇంధనం (తాజాగా హరిత ఇంధనం పేర హైడ్రోజన్ రంగం) మొదలుకొని అనేక రంగాలలో తమ ఇనుప పాదాన్ని మోపింది.
ప్రమాద ఘంటికలు
మోదీ ప్రభుత్వం 2014లో ఏర్పడిన నాటి నుంచి పరిణామాల పట్ల ప్రజాస్వామ్య ప్రియుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నామరూపాలు లేకుండా పోవాలని అణచివేత చర్యలను ప్రయోగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నది. పార్లమెంటును, న్యాయవ్యవస్థను ఇతర వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు తమవంతు పాత్రను పోషించే అవకాశం ఉండాలి.
ఆసేతు హిమాచలం దేశవ్యాప్తంగా అనేక జాతులు మతాలు, భాషా సంస్కృతుల వారున్నారు. ప్రతివర్గం తమ గొంతు వినిపించడానికి, తమ హక్కులు కాపాడుకోవడానికి, తమ డిమాండ్లు సాధించుకోవడానికి సొంత పార్టీలను పెట్టుకుంటాయి. సొంత పత్రికలను, టీవీ చానళ్లను నెలకొల్పుకుంటాయి. దేశమంతా ఒకే పార్టీ ఉండాలంటూ, వివిధ మీడియా సంస్థలను కూడా కబళిస్తూ పోతే మరి దేశ ప్రజలు తమ గొంతు వినిపించుకునే అవకాశం ఎలా ఉంటుంది?
ఒకవైపు అంబానీ మరోవైపు అదానీ మీడియా సంస్థలను కబళిస్తూ పోతే . ప్రజల గొంతుక వినిపించడం ఎలా? ప్రజాస్వామ్య బద్ధంగా తమ గొంతు వినిపించే అవకాశం లేనప్పుడు పార్లమెంటేతర విధానాలు ముందుకు వస్తాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయవలసి వస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా మారుతుంది. అందువల్ల మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ముసుగులో ఇటువంటి తమాషాలు చేయడం మానుకోవాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావలిసి వస్తుంది.
దేశమంతా భిన్న వార్తా సంస్థలు ఉంటే, ప్రజలు ఏమనుకునేది ప్రభుత్వానికి తెలుస్తుంది. అది పాలకులకు కూడా ఉపయోగకరమే. జాగ్రత్త పడటానికి వీలుంటది. కానీ మొత్తం మీడియాను తమ గుప్పెటలో పెట్టుకొని చెవులలో సీసం పోసుకుని రాజభవనంలో కూచుంటే, ప్రజాగ్రహం కట్టలు తెంచుకునే వరకు వాస్తవ పరిస్థితి తెలిసిరాదు. పాలకులు ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన విధానాలు అనుసరిస్తే మొదటికే మోసం వస్తుంది. వారి పీఠాలే కంపించి పోతాయి