UPI |
విధాత: భారత చెల్లింపుల సాంకేతికత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ పర్యటనలో ఉన్న జర్మనీ డిజిటల్, ట్రాన్స్పోర్ట్ మంత్రి (Germany Minister) వోల్కర్ విస్సింగ్.. యూపీఐ (UPI) ను ఉపయోగించి కూరగాయలు కొనుగోలు చేశారు. కేవలం రెండు మూడు క్లిక్లతో డబ్బులు చెల్లించేయడం,.. అవి విక్రేతల ఖాతాల్లోకి సెకన్లలోనే వెళ్లిపోవడం చూసి అచ్చెరువొందారు.
దీనికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను భారత్లోని జర్మనీ ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత విజయగాథల్లో యూపీఐ ఒకటి. సెకండ్లలో చెల్లింపులను పూర్తిచేస్తున్న ఈ సాంకేతికతను లక్షల మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు. ఇందులోని సౌలభ్యతను విస్సింగ్ అనుభూతి చెందారు అనే వ్యాఖ్యను తన పోస్టుకు జత చేసింది. ఈ నెల 19న జరిగిన జీ 20 దేశాల డిజిటల్ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన బెంగళూరుకు వచ్చారు.
One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C
— German Embassy India (@GermanyinIndia) August 20, 2023
ఈ పోస్టులపై భారతీయులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. భారత సాంకేతిక విప్లవంలో భాగమైనందుకు విస్సింగ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరు వ్యాఖ్యానించారు. నగదు రూపేణా మాత్రమే చెల్లింపులున్న జర్మనీలో ఇలాంటి వ్యవస్థ అత్యవసరమని మరొకరు పేర్కొన్నారు. జర్మనీ ఎప్పుడు యూపీఐలో భాగం అవుతుందని మరొకరు ప్రశ్నించారు. ప్రస్తుతం శ్రీలంక, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలు యూపీఐ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి.