నాయకత్వంపై విశ్వాసం లేకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయని.. నాయకులు పార్టీని వీడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
కేసీఆర్ కోటరితోనే బీఆరెస్కు ఈ దుస్థితి
ఆర్నెల్లుగా నాకు అపాయింట్మెంట్ లేదు
పార్టీలో కొరవడిన సంస్థాగత నిర్మాణం..సమీక్షలు
జిల్లాలో లిల్లీపుట్ నాయకులను తయారు చేశారు
గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీ మారే ఆలోచన లేదంటూ స్పష్టీకరణ
విధాత : నాయకత్వంపై విశ్వాసం లేకనే బీఆరెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయని.. నాయకులు పార్టీని వీడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన గుత్తా బీఆరెస్లో నెలకొన్న పరిణామాలపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కోటరి వల్లే బీఆరెస్కు ఈ దుస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు.
బీఆరెస్లో ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయని.. పార్టీలో పరిస్థితులపై .. ఓటమిపై అంతర్గత సమీక్షలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. పార్టీలో గ్రామ, మండల, జిల్లా శాఖలు లేవని, సంస్థాగత నిర్మాణం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆరెస్లో సంస్థ గత మార్పులు అవసరమని, కేసీఆర్ను విమర్శించి.. నెపం ఆయన మీద నెట్టడం నా ఉద్దేశం కాదన్నారు. పార్టీ విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర నష్టం తప్పదని, పార్టీ విధానాల్లో ఓటమిపై సమక్ష జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేను పార్టీ మారనని, అలాంటి అలోచన ప్రస్తుతానికి లేదన్నారు.
అవినీతి..అహంకార పూరిత నాయకులతో ప్రజలకు పార్టీ దూరం
ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆరెస్లో చాలామంది కోటీశ్వరులు అయ్యారనీ ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కొందరు లిల్లీపుట్ లను తయారు చేశారని విమర్శించారు. బీఆరెస్లో అంతర్గత సమస్యలు.. నేతల సహాయ నిరాకరణతోనే ఎంపీ ఎన్నికల్లో నా కుమారుడు అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని స్పష్టం చేశారు. నేతలు అవినీతి, అహంకార పూరితంగా వ్యవహరించడంతో ప్రజలకు పార్టీ దూరమైందన్నారు.
పల్లి బఠానీలు అమ్ముకునే నేతలు కోట్లకు పడగలెత్తారన్నారు. ఎంతసేపు ఎదుటి వారిపై చాడీలు చెప్పే నేతలకే కేసీఆర్ కోటరిలో కొనసాగుతున్నారన్నారు. వారితోనే పార్టీ ప్రజలకు దూరమైందన్నారు. ఆ విషయం కార్యకర్తలు అందరికీ తెలుసన్నారు. నన్ను విమర్శించే బీఆరెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. త్వరలో వారి బండారం బయటపెడతానని గుత్తా వెల్లడించారు. గతంలో తాను కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి హామీ తోనే బీఆరెస్లో చేరడం జరిగిందన్నారు. కానీ కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు.
ప్రస్తుతం తాను ఏ పార్టీతో సంబంధం లేని రాజ్యాంగబద్ధ పదవి శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్నానని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హత కు సంబంధించి ఫిర్యాదులను రాజ్యాంగ ప్రకారం న్యాయ నిపుణుల సలహాలతో నిష్పాక్షికంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని.. ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వడం ..ఖజానా ఖాళీగా ఉండడంతో కనీసం ఏడాది పాటైన ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదన్నారు.
గులాబీ గూటిలో గుత్తా వ్యాఖ్యల అలజడి
గుత్తా సుఖేందర్ రెడ్డి, కొంతకాలంగా బీఆరెస్ అగ్ర నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ నాయకత్వం పై గుత్తా తాజాగా చేసిన విమర్శల నేపధ్యంలో ఆయన కూడా త్వరలో బీఆరెస్ను వీడ వచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం నుంచి గుత్తాకు, ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ లభించిన నేపథ్యంలోనే ఆయన బీఆరెస్ నాయకత్వంపై విమర్శలకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆరెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. గుత్తా కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుపడ్డారని గుత్తా కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తన కుమారుడికి టికెట్ రాకుండా చేయడమేగాక, పార్టీలో తన ప్రత్యర్థిగా ఉన్న కంచర్ల భూపాల్రెడ్డి, కృష్ణారెడ్డిలను ప్రొత్సహిస్తు కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించడం గుత్తాను మరింత ఆగ్రహానికి గురి చేసింది. తాజాగా గుత్తా జిల్లా బీఆరెస్లో లిల్లీపుట్ నాయకులంటూ చేసిన వ్యాఖ్యలు జగదీశ్ రెడ్డిని, ఆయన మద్దతు దారులైన కొందరు మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినవేనంటున్నారు. గుత్తా తాజా విమర్శల క్రమంలో ఉమ్మడి జిల్లా బీఆరెస్ రాజకీయాల్లో గుత్తా వర్గీయులకు.. జగదీశ్ రెడ్డి వర్గీయులకు మధ్య మునుముందు మరింతగా పరస్పర ఆరోపణల పర్వం కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల తరుణంలో గుత్తా బీఆరెస్ను వీడిన పక్షంలో జిల్లా రాజకీయాల్లో ఆ పార్టీకి ఆ మేరకు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.