Hydra: హైడ్రా జోరు..రూ.200కోట్ల స్థలం పరిరక్షణ!

Hydra: ప్రభుత్ స్థలాల పరిరక్షణ..ఆక్రమణల తొలగింపులో హైడ్రా ప్రాధాన్యతం క్రమంగా ప్రజలకు అర్ధమవుతుంది. జూబ్లీహిల్స్లో దాదాపు రూ.200 కోట్లు విలువ చేసే రెండెకరాల పార్క్ స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. కబ్జాదారుడు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దాని చుట్ట ఉన్న ప్రభుత్వం, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమించగా..వాటిని హైడ్రా తొలగించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 41 పెద్ధమ్మ గుడి సమీపంలోని నాలాతో పాటు పార్క్ రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. ఓ కబ్జాదారుడు ఇంటిని అద్దెకు తీసుకుని యజామానికి తెలియకుండా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఆస్తులను పార్కు స్థలాలు ఆక్రమించి దర్జాగా హోటళ్లు, హాస్టల్స్ కు అద్దెకు ఇచ్చి నెలకు రూ.10లక్షలు వసూలు చేస్తున్నాడు.
దీనిపై యజమాని హైడ్రాకు ఫిర్యాదు చేయగా..అద్దె వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. అతను సుప్రీంకోర్టును ఆశ్రయించగా..అక్రమంగా తనకు హక్కులేని స్థలాలను ఆక్రమించి..ఏకంగా భవనాలు నిర్మించడంపై మండిపడింది. వెంటనే నాలతో పాటు రోడ్లు, పార్కు స్థలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో విరుచుకుపడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఆ ప్రదేశంలో జీహెచ్ఎంసీ చక్కటి పార్క్ను ఏర్పాటు చేయనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. విలువైన ప్రజోపయోగ స్థలాలను పరిరక్షించిన హైడ్రాకు స్థానికులు జేజేలు పలుకుతున్నారు.
అటు ఫిర్జాదిగూడలో కబ్జాల చెర నుంచి దాదాపు 2 ఎకరాల మేర ఉన్న గ్రేవ్యార్డును కాపాడుకున్నామని అక్కడి వారు పండగ చేసుకున్నారు. టెంటులు వేసి సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఆనందం పంచుకున్నారు. టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.