Nizamabad | రెండు వర్గాలుగా చీలిన పార్టీ శ్రేణులు గోడదూకుతున్న మింగుడుపడని నాయకులు ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు సంకటం విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, ఎంపీ అరవింద్ కు పొసగటం లేదన్న చర్చ తెరపైకి వచ్చింది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరలేచింది. ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సంకటంలో పడేస్తోంది. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అరవింద్ ఎంట్రీ నుంచి వర్గ పోరు తారస్థాయికి చేరిందని […]
Nizamabad |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, ఎంపీ అరవింద్ కు పొసగటం లేదన్న చర్చ తెరపైకి వచ్చింది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరలేచింది. ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సంకటంలో పడేస్తోంది. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అరవింద్ ఎంట్రీ నుంచి వర్గ పోరు తారస్థాయికి చేరిందని ఆ పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జిల్లా బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, ఎంపీ అరవింద్ రెండు వర్గాలుగా మారాయనేది బాహాటంగా చెప్పుకుంటున్నారు.
పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య అందరినీ కలుపుకొని పోతున్నారని… ఇది అరవింద్ కు ఏ మాత్రం నచ్చటం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. యెండల వర్గాన్ని బస్వ లక్ష్మినర్సయ్య ప్రోత్సహిస్తున్నారని, అందుకే వీరి మధ్య విభేదాలకు కారణం అని చర్చ జరుగుతోంది. అధ్యక్షుడికి, మీకు పొసగటం లేదన్న విలేఖరుల ప్రశ్నకు అరవింద్ బలం చేకూర్చేలా… జిల్లా పార్టీ అధ్యక్షుడి వయస్సుకు, నా వయస్సుకు 20 ఏళ్లు గ్యాప్… అదే గ్యాప్ అంటూ చమత్కరించారు. కానీ పార్టీలో అలాంటి విభేదాలేమీ లేవని చెప్పలేకపోతున్నారు.
అర్బన్ సీటు కోసం పట్టు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గం నుంచి జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్య నారాయణ టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఎంపీ అరవింద్ బహిరంగంగానే ధనపాల్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. దీంతో మిగతా వర్గాలు నొచ్చుకుంటున్నాయి.
ఒక్క నిజామాబాద్ అర్బన్ లోనే కాకుండా బోధన్ లోనూ ఇదే తీరు ఎదురవుతోంది. పార్టీకి కొన్నేళ్లుగా పనిచేస్తున్న నాయకులను కాదని, కొత్తగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డిని ఎంపీ అరవింద్ బీజేపీలో చేర్పించారు. ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. ఆర్మూర్ లోపార్టీనే నమ్ముకొని, కార్యకర్తల కోసం పనిచేస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నియోజకవర్గ ప్రజా సమస్యలు, ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను నిలదీస్తూ, పార్టీని ముందుకు నడుపుతూ పనిచేస్తున్న పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ని పక్కనపెట్టారు.
పారిశ్రామిక వేత్త, రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి పైడి రాకేష్ రెడ్డిని బీజేపీలోకి చేర్చి ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు బీజేపీ మండల అధ్యక్షులను అరవింద్ మార్చి కొత్తగా పార్టీలో చేరిన వారికి మండల అధ్యక్షుల పదవులను ఇవ్వడంతో వారంతా రాష్ట్ర కమిటీకి ఎంపీపై ఫిర్యాదులు సైతం చేశారు.
వినయ్ రెడ్డితో సహా వీరంతా పార్టీని వీడి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపార్టీలో చేరారు. జిల్లాలో మరో నియోజకవర్గం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇలాకా బాల్కొండ నియోజకవర్గంలోనూ బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి రాకుండా ఎంపీ అరవింద్ ఆడుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు.
రచ్చకెక్కుతున్న పోరు
అరవింద్ పార్టీలో చేరిన మొదట్నుంచి ఎంపీగా గెలిచేవరకు బస్వ లక్ష్మినర్సయ్యతో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరికీ అస్సలు పడటం లేదన్న చర్చ ఆవర్గాల్లో చర్చ నడుస్తోంది. యెండల వర్గం, అరవింద్ వర్గం అంటూ ఇప్పటికే జిల్లా పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్వతో కూడా అరవింద్ కు పొసగకపోవటంతో పోరు రచ్చకెక్కింది.
జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ అరవింద్ తన వర్గాన్ని పెంచుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడుతున్న కార్యకర్తలు, నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.