విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేవలం ఓట్లప్పుడు వచ్చే రాజకీయ పార్టీ నాయకున్ని కాదని, నిత్యం మీతో ఉంటూ, మీలో ఒకడిగా ఉంటానని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హంటర్ రోడ్ అభిరామ్ గార్డెన్స్ లో సోమవారం జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అన్నగా తోడుంటా.. అన్ని వేళలా అండగా నేనుంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా నన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గా ఉన్నానని అన్నారు. నాడు నియోజకవర్గ మొత్తానికి కేవలం ఐదు కోట్ల నిధులు కూడా రాని పరిస్థితి ఉండేదని నేడు వేలకోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న అని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఉంటారని అన్నారు. రాజకీయం చేయడానికి కొందరు నాయకులు వస్తున్నారని, అలాంటి నాయకులు వరదలు, వానలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని అడిగారు. గత ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల అయిపోయినాక కనుమరుగయ్యారని తెలిపారు.
తాను మాత్రం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మధ్య ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్, పార్టీపై ఈ డివిజన్ ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు.
గుడిసెవాసులకు అండగా
పేదలకు గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం తరపున పట్టాలు అందిస్తానని వినయ్ అన్నారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి అర్హులైన వారికి పట్టాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ బాబు, కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.