విధాత: ఇటీవల సంక్రాంతికి విడుదలైన నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు రెండింటిని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాల రిలీజ్కు ముందు ఆ సంస్థపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
ఇక ఆ మధ్య విడుదలైన పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండల ‘లైగర్’ చిత్ర విషయంలో ఏకంగా ఈడీ అధికారులు దాడులు చేశారు. పెట్టుబడికి ఎక్కడినుంచి డబ్బులు వచ్చాయి? రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అంటూ హీరో విజయ్ దేవరకొండను కూడా దాదాపు 11 గంటల పాటు విచారించారు.
ఇదే తరహాలో దర్శకుడు పూరీ, నిర్మాత చార్మిలపై కూడా విచారణ సాగింది. తాజాగా కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే చిత్రాలు నిర్మించే హారిక అండ్ హాసిని సంస్థపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. తెలుగులో ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థ అయిన దీనికి చినబాబు అలియాస్ కె రాధాకృష్ణ నిర్మాణ సారథి. వీరికి మరో సహ నిర్మాణ సంస్థ కూడా ఉంది. దాని పేరు సితార ఎంటర్టైన్మెంట్స్. దాని నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్లో కేవలం త్రివిక్రమ్తో మాత్రమే చిత్రాలు తీస్తూ ఉంటారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో మిగిలిన చిత్రాలు రూపొందుతూ ఉంటాయి. ఇలా ఈ రెండు భారీ సంస్థలకు చెందిన ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ తాజాగా దాడులు నిర్వహించింది. అది కూడా మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ల SSMB28 చిత్రం షూటింగ్ ప్రారంభ సమయంలోనే కావడం విశేషం.
హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్లో మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు కూడా వాటా ఉందని అంటూ ఉంటారు. కొన్ని చిత్రాలకు పవన్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఈ సంస్థపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ సంస్థపై ఐటీ దాడులతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. మరి ఈ దాడులలో ఏమేం బయటపడ్డాయనే విషయంపై మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు.