పొత్తులపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలో కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించింది. వెంకట్రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేగుతున్న సమయంలోనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఆయనను కలిసి వెంకట్రెడ్డి వివరణ ఇచ్చారు.
అయితే ఆయనపై వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీంతో వెంకట్రెడ్డి విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నదన్న చర్చ సర్వత్రా జరిగింది. అయితే ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందోనని, వెంకట్రెడ్డిపై వేటు ఖాయమని అనుకుంటున్న సమయంలో టీ కప్పులో తుఫానులా ముగిసిపోయింది.
హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఠాక్రేతో పార్టీ సీనియర్ నేతల మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్లు సమావేశమయ్యారు. బీఆర్ఎస్, బీజేపీలను ఏ విధంగా ఎదుర్కొవాలనే అంశంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే విషయంపై చర్చించినట్టు సమావేశ అనంతరం జగ్గారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఆ పార్టీలో నేతలు ఎవరి అబిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెల్లడిస్తారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు. కానీ పార్టీకి నష్టం చేసేలా బహిరంగ వేదికలపై కాకుండా అంతర్గతంగా మాట్లాడాలని సూచించింది.
అలాగే కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని ఆ పార్టీ నేతలే ఆ పార్టీని ఓడిస్తారనే నానుడి కూడా ఉన్నది. పార్టీ అధికారంలోకి రావాలంటే నేతలంతా విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా కృషి చేయాలని పార్టీ అధిష్టానం తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే సూచించారు. రేవంత్ అంటే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి, కోమటిరెడ్డిలకు ఠాక్రే హితబోధ చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవాంటే కలిసి నడక తప్పదనే విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే పార్టీకి అంత మేలు చేసిన వారవుతారని, పార్టీకి భవిష్యత్తు అని నేతలు వెళ్లినా పార్టీని కాపాడు కుంటున్న సామాన్య కార్యకర్తలు కోరుకుంటున్నారు.