Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. కమిషనర్ వైఖరిని నిరసిస్తూ అధికార, విపక్ష కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా నాలుగో వార్డు కౌన్సిలర్ బెడుక లక్ష్మి.. కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ వార్డులో అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. సభలోనే బైఠాయించారు. కింద కూర్చొని నిరసనకు దిగారు. అధికార, విపక్ష సభ్యులు సైతం మద్దతు ప్రకటించారు. కమిషనర్ తీరును ఎండగట్టారు. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు.
ఆక్రమణదారులతో కమిషనర్ కుమ్మక్కు
మున్సిపల్ పరిధి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నా, చర్యలు తీసుకోవడంలో కమిషనర్ విఫలమవుతున్నారని, ఆక్రమణదారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నాడని కౌన్సిలర్లు ఆరోపించారు. కౌన్సిల్ బహిష్కరణ అనంతరం వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, అధికార పార్టీ కౌన్సిలర్లు బెర సత్యనారాయణ, బౌత్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సురిమిళ్ళ వేణు విలేకరులతో మాట్లాడారు. కమిషనర్ రమేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని పనులు అవసరం లేకున్నా, తమ సొంత ఎజెండా అమలు చేస్తూ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొన్ని ప్రైవేటు వెంచర్లలో రోడ్లు వేసి, ఆతర్వాత రోడ్లు తొలగించకపోవడం వెంచర్ యజమానులతో కమిషనర్ కుమ్మక్కయ్యారని తెలిపారు. వెంచర్ల యజమానుల నుంచి ముడుపులు తీసుకొని, వేసిన రోడ్లను తొలగించడం లేదని ఆరోపించారు. కమిషనర్ పై జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.