Manipur Riots న్యూఢిల్లీ: మణిపూర్లో కొనసాగుతున్న హింసలో బాధితులకు అందుతున్న సహాయ, పునరావాస చర్యలపై ముగ్గురు హైకోర్టు మహిళా జడ్జీలతో సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది. ఈ అంశంపై సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కమిటీకి జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వం వహిస్తారు. రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ శాలిని పీ జోషి, జస్టిస్ ఆశా మీనన్ సభ్యులుగా ఉంటారు. మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్న […]
Manipur Riots
న్యూఢిల్లీ: మణిపూర్లో కొనసాగుతున్న హింసలో బాధితులకు అందుతున్న సహాయ, పునరావాస చర్యలపై ముగ్గురు హైకోర్టు మహిళా జడ్జీలతో సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది. ఈ అంశంపై సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
కమిటీకి జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వం వహిస్తారు. రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ శాలిని పీ జోషి, జస్టిస్ ఆశా మీనన్ సభ్యులుగా ఉంటారు. మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్న హింసలో దాఖలైన కేసుల విచారణను పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర మాజీ డీజీపీ దత్తాత్రేయ పడ్సల్గికర్ను నియమించింది.
దర్యాప్తు సక్రమంగా సాగుతున్నదో లేదో ఒక నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించింది. మహిళలపై హింస కేసులను విచారిస్తున్న సీబీఐకి వివిధ రాష్ట్రాల నుంచి డీఎస్పీ/ఎస్పీ ర్యాంక్ అధికారులు ఐదుగురిని డిప్యూట్ చేయనున్నట్టు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు సక్రమంగా సాగుతున్నదో లేదో పరిశీలించేందుకు మణిపూర్కు వెలుపలి రాష్ట్రాల నుంచి ఎస్పీ ర్యాంక్ స్థాయి అధికారులను డిప్యూట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఉత్తర్వులు ఉంచుతామని తెలిపింది.
సీబీఐకి బదలాయించని కేసులను 42 ప్రత్యేక దర్యాప్తు బృందాలు పరిశోధిస్తున్నాయి. ఈ సిట్లు అన్నీ మణిపూర్కు వెలుపలి డీఐజీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపింది. ప్రతి ఒక్క అధికారి ఆరేసి సిట్లను పర్యవేక్షిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు మణిపూర్ డీజీపీ రాజీవ్సింగ్ హాజరయ్యారు.