Minister Harish Rao |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఆగస్టు 19వ తేదీన మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన బీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యాలయాన్ని సందర్శించి అక్కడి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై అధికారులకు, పార్టీ నాయకత్వానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అధికారులు ,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
అధికారులతో మంత్రి సమీక్షా..
సీఎం కేసీఆర్ 19 న మెదక్ కు రానున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో పాటు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి తదితరులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.