Modi Statue |
పుణె: ప్రపంచంలోనే అది పెద్ద విగ్రహం ఎక్కడుందంటే గుజరాత్లోని నర్మదానదీ తీరాన ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్దని చెబుతాం. కానీ.. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత మాత్రం.. పుణెలోని లావాసాలో ఉన్న నరేంద్రమోదీ విగ్రహం అని చెప్పాల్సి ఉంటుంది. అవును.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా ప్రతిమ కంటే పెద్దదైన నరేంద్ర మోదీ విగ్రహాన్ని పుణెలోని లావాసా వద్ద నిర్మించనున్నారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్ 31న ఆవిష్కరించనున్నారని సమాచారం.
డార్విన్ ప్లాట్ఫాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీపీఐఎల్) ఈ నిర్మాణం చేపట్టనున్నది. ఇప్పటికే అహ్మదాబాద్లోని స్టేడియానికి నరేంద్రమోదీ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహం కూడా రాబోతున్నది.
దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణ కోసం ప్రధాని మోదీ చేసిన విశేష సేవకు గుర్తింపుగా ఈ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు డీపీఐఎల్ తెలిపింది. గొప్ప దృక్కోణం ఉన్న నేతగా మోదీని కంపెనీ అధినేత అజయ్ హరినాథ్సింగ్ అభివర్ణించారు.
ఐక్యతా ప్రతిమ ఎత్తు 182 మీటర్లు. అయితే.. మోదీ విగ్రహం 190 నుంచి 200 మీటర్ల ఎత్తుతో ఉంటుందని సమాచారం. ఈ విగ్రహ ప్రాంగణంలో భారతదేశ గొప్ప వారసత్వం, నూతన భారతదేశ ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఒక మ్యూజియం, మెమోరియల్ పార్క్, ఒక వినోద కేంద్రం, ఎగ్జిబిషన్ హాల్ ఉంటాయి. మోదీ జీవితంపై బయోగ్రాఫికల్ ఫిల్మ్ను ఎగ్జిబిషన్ హాల్లో ప్రదర్శిస్తారు.