విధాత: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు రాజ్యంగ విరుద్దమంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ధ ఒక రోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021లో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్లో లేని బాబును నాలుగేళ్ల తర్వారా అరెస్టు చేయించిన సీఎం వైఎస్ జగన్ నిర్వాహకాన్ని ప్రజలు ఖండించాలన్నారు.
జగన్ను, ఆయన పాలనా విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని అసమర్ధుడని, ప్రజలు జగన్ను చీత్కరించుకుంటున్నారన్నారు. నారా భువనేశ్వరి ఉసురు జగన్కు తగులుతుందన్నారు. సొంత బాబాయ్ను చంపిన నేరస్థుడని పట్టుకోలేని జగన్ ఎలాంటి నాయకుడో ప్రజలు అర్ధం చేసుకోవచ్చన్నారు. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో వాట ఇవ్వకుండా బయటకు పంపారని, జగన్ గెలుపు పాపంలో నాకు భాగస్వామ్యం ఉందని బాధపడుతున్నానన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో జగన్కు నష్టమని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటమి తప్పదన్నారు.