ఫంక్షన్ పేరుతో పిలిపించి.. ప్రియురాలి కాలు విరగ్గొట్టిన ప్రియుడు
ఓ యువకుడు తన ప్రియురాలి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఫ్యామిలీ ఫంక్షన్ ఉందంటూ పిలిపించి, ఆమె కుడి కాలు విరగ్గొట్టాడు

ముంబై : ఓ యువకుడు తన ప్రియురాలి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఫ్యామిలీ ఫంక్షన్ ఉందంటూ పిలిపించి, ఆమె కుడి కాలు విరగ్గొట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్.. ప్రియా సింగ్(26) అనే యువతిని గత ఐదేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. ఫ్యామిలీ ఫంక్షన్ ఉందంటూ ప్రియాకు అశ్వజిత్ ఫోన్ చేశాడు. దీంతో ప్రియా థానేలోని ఓ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ పలువురి ఫ్రెండ్స్ కలిశారు. ఆ తర్వాత అశ్వజిత్తో ప్రియా మాట్లాడే ప్రయత్నం చేయగా, ప్రయివేటుగా మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు.
ఇక అక్కడ ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలోనే ప్రియాపై నుంచి అశ్వజిత్ తన కారును పోనిచ్చాడు. దీంతో ప్రియా కుడి కాలు విరిగిపోయింది. అర గంట తర్వాత అటు నుంచి వెళ్తున్న ఓ వాహనదారుడు ప్రియాను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశాడు.
ప్రస్తుతం ప్రియా కుడి కాలిలో ఐరన్ రాడ్ వేశారు. 3 నుంచి 4 నెలల పాటు బెడ్కే పరిమితం కావాలని వైద్యులు చెప్పారు. ఆరు నెలల వరకు తాను నడవలేనని ప్రియా పేర్కొన్నారు. ప్రస్తుతం తన శరరీమంతా గాయాలు ఉన్నాయని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు బాధితురాలు తెలిపారు. అయితే అశ్వజిత్ గైక్వాడ్పై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.