Nalgonda ఎమ్మెల్యే కంచర్ల తీరు పై మహా ధర్నాకు రామరాజు సన్నాహాలు విధాత: నల్గొండ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, ఆయనకు పోటీగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు యాదవ్ కు మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు మరో మలుపు తీసుకుంది. తనకు పోటీగా నియోజకవర్గంలో నిత్యం రాజకీయ కార్యకలాపాలతో జనంలో దూసుకెళ్తున్న రామరాజు పై అసహనంతో ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పోలీస్ శాఖను ఉసిగొలుపుతూ రామరాజు […]
Nalgonda
విధాత: నల్గొండ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, ఆయనకు పోటీగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు యాదవ్ కు మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు మరో మలుపు తీసుకుంది. తనకు పోటీగా నియోజకవర్గంలో నిత్యం రాజకీయ కార్యకలాపాలతో జనంలో దూసుకెళ్తున్న రామరాజు పై అసహనంతో ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పోలీస్ శాఖను ఉసిగొలుపుతూ రామరాజు అనుచరులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్న ఆరోపణలు పార్టీలో మరింత చిచ్చురేపుతున్నాయి.
తాజాగా మర్రిగూడ బైపాస్ ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన వేడుకలకు ఒకే సమయంలో కంచర్ల, రామరాజులు ఇద్దరు గుడి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య డీజె పాటల విషయంలో తలెత్తిన రగడ నేపథ్యంలో డీజే ఓనర్ పై ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే కంచర్ల నా అనుచరులు పదిమందిపై అక్రమ కేసులు పెట్టించారని రామరాజు ఆరోపిస్తున్నారు.
నల్లగొండ రూరల్ ఎస్సైగా ఉన్న ఎమ్మెల్యే బంధువైన కంచర్ల భాస్కర్ రెడ్డి నా అనుచరులను కోర్టులో హాజరు పరచకుండా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ రామరాజు ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయంగా తనని ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకొని సొంత పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా నా అనుచరులతో పాటు నా బావమరిదిపై కూడా పోలీసులను ఒత్తిడి చేసి ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని రామరాజు రగిలిపోతున్నారు.
ఎమ్మెల్యే కంచర్ల చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యేగా ఆయన అధికారం శాశ్వతం కాదంటూ రామరాజు హితవు చెబుతున్నారు. ఇదే సమయంలో తన వర్గీయులపై ఎమ్మెల్యే కంచర్ల చేస్తున్న ఆగడాలను అడ్డుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తన మద్దతు దారులతో మహాధర్నాకు రామరాజు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మునుముందు నల్గొండ నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.