Nalgonda విధాత: నల్గొండ కలెక్టరేట్లో బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాదిపై జరిగిన దాడి ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావులు కూడా హాజరైన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న 15 సూత్రాల పథకాల సమీక్ష, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ నిర్వహించారు. సమావేశం మధ్యలో కలెక్టర్, ఎస్పీలు ఇతర […]
Nalgonda
విధాత: నల్గొండ కలెక్టరేట్లో బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాదిపై జరిగిన దాడి ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావులు కూడా హాజరైన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న 15 సూత్రాల పథకాల సమీక్ష, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ నిర్వహించారు.
సమావేశం మధ్యలో కలెక్టర్, ఎస్పీలు ఇతర కార్యక్రమాల నేపథ్యంలో బయటకు వెళ్లారు. మైనార్టీల సమస్యలపై చర్చ సాగుతున్న సందర్భంగా ఎంఐఎంకు చెందిన రజియుద్దిన్ అనే వ్యక్తి సుదీర్ఘంగా మాట్లాడుతుండగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని షెహజాది సూచించారు.
ఈ సందర్భంగా తలెత్తిన వాగ్వివాదంతో ఆగ్రహించిన రజియుద్దిన్ ఒక్కసారిగా షెహజాదిపై దూసుకెళ్లి దాడికి యత్నించగా, అడ్డుగా ఉన్న ఆమె పిఏ రాజేష్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో అక్కడే ఉన్న పోలీస్ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వివాదం మరింత పెద్దది కాకుండా నిలువరించారు.
కాగా తనపై దాడికి యత్నించి, తన పీఏ పై చేయి చేసుకున్న ఘటన పట్ల జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు షెహజాది జిల్లా ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. తాను ముస్లిం మైనార్టీల సమస్యలను తెలుసుకునేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మైనారిటీ సంక్షేమ పథకాలు వారికి అందుతున్న తీరుతెన్నులపై సమీక్షించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు.
కాశ్మీర్లో సైతం తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యటించానని, చివరకు తన సొంత రాష్ట్రంలో నల్గొండ కలెక్టరేట్ లో, అధికారిక సమావేశంలో పోలీసులు, అధికారుల సమక్షంలో దాడి జరగడం విచారకరమని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై దాడికి ప్రయత్నించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
ముస్లింల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లకుండా కొందరు దాడులకు యత్నిస్తున్నారన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలైన తనపైనే ఇలా దాడికి పాల్పడితే సామాన్య జనం పై వారు ఎంతటి అరాచకాలకు పాల్పడుతున్నారో ఆలోచించాల్సి ఉందన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు.