New Delhi | ED డైరెక్టర్‌.. పదవీకాలం పొడిగించండి: సుప్రీంను కోరిన కేంద్రం

New Delhi | నెలాఖరుతో ముగియనున్న మిశ్రా పదవీకాలం అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌ న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంలో ప్రస్తతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నదో అందరికీ తెలిసిందే. ఐటీ, సీబీఐతోపాటు ఈడీనీ అధికార బీజేపీ తన రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నదని, ప్రతిపక్షాల గొంతు నులిమేందుకు వాడుతున్నదని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌కే మిశ్రా పదవీకాలం […]

  • Publish Date - July 26, 2023 / 03:56 PM IST

New Delhi |

  • నెలాఖరుతో ముగియనున్న మిశ్రా పదవీకాలం
  • అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంలో ప్రస్తతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నదో అందరికీ తెలిసిందే. ఐటీ, సీబీఐతోపాటు ఈడీనీ అధికార బీజేపీ తన రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నదని, ప్రతిపక్షాల గొంతు నులిమేందుకు వాడుతున్నదని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌కే మిశ్రా పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. గతంలో పదవీకాలాన్ని పొడిగించడంపై ఈ నెల 11వ తేదీన తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు.. ఆ చర్య చట్ట వ్యతిరేకమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయన అక్టోబర్‌ 15 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు వీలు కల్పించాలని అందులో కోరింది. ఈ విషయంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

గత తీర్పును వెలువరించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రస్తుతం వేర్వేరు కాంబినేషన్లలో ఇతర కేసులను విచారిస్తున్నట్టు జస్టిస్‌ గవాయి తెలిపారు. ఈ విషయంలో సీజేను రిజిస్ట్రీ సంప్రదిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం విచారణ చేపట్టేందుకు సొలిసిటర్‌ జనరల్‌ విజ్ఞప్తి చేయగా.. గురువారం సాయంత్రం వాదనలు వింటామని గవాయి తెలిపారు.