Padi Kaushik Reddy |
- క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం
- ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పాడె కడుతామని అల్టిమేటం
- షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం
- పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు
- ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని సీఎం కేసీఆర్ ను కోరిన ముదిరాజులు
విధాత బ్యూరో, కరీంనగర్: ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకువచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గాన్ని ఆందోళనల వైపు పురికొల్పాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించిన ముదిరాజ్ కులస్తులు వాటిని దగ్ధం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున పార్టీలకతీతంగా ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ముదిరాజ్ సంఘం నేతలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకొని పక్షంలో
అధికార టిఆర్ఎస్ ముదిరాజుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు మంద నగేష్ హెచ్చరించారు.
బాధ్యత గల పదవిలో ఉంటూ ఓ వీడియో జర్నలిస్టును దుర్భాషలాడి అతని కెమెరా లాక్కొని అతనిపై దాడికి పాల్పడడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని, 24 గంటల్లో అతనిపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోకపోతే ముదిరాజుల తడాఖా ఏమిటో? రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామని ముదిరాజ్ సంఘం నాయకులు హెచ్చరించారు.
శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని ముదిరాజ్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఆయా పార్టీలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఈ ధర్నాలో పాల్గొనడం గమనార్హం.
ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు డిమాండ్ చేసింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉంటూ ఒక వీడియో జర్నలిస్టును కిడ్నాప్ చేసి అతని హింసించడం కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు. ముదిరాజులు తలుచుకుంటే కౌశిక్ రెడ్డి మిగలడని హెచ్చరించారు.
అనేక సందర్భాల్లో రౌడీలా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని బాబయ్య డిమాండ్ చేశారు. స్థానిక అధ్యక్షుడు అంచె రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ముదిరాజులు వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా సామాన్య ప్రజలను, బాధ్యత గల జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.
పనికిమాలిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడం ఎంత మాత్రం సబబు కాదని వారన్నారు. వెంటనే అతన్ని పదవి నుండి తొలగించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యువ నాయకుడు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగక తప్పదని ,తమ ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి బలి కాక తప్పదని హెచ్చరించారు.
మరో నేత అందే మోహన్ మాట్లాడుతూ 24 గంటల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికార మదంతో వీర్రవీగుతున్న కౌశిక్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఇంకా ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు నాయకులు కౌశిక్ రెడ్డి పై తీరుపై విరుచుకుపడ్డారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కౌన్సిలర్ కానుగు అనంతయ్య, ప్యాట అశోక్,టీజెఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, అంచెరాజు, కుడుముల బాలరాజ్, ఎలికట్ట ఎంపిటిసి శ్రీశైలం, బుడ్డ నరసింహ, చెట్ల వెంకటేష్, రమేష్, నలమొని శ్రీధర్, అందే పైలయ్య, మంగ వెంకటేశ్, కొండే యాదయ్య, భాస్కర్, గూడూరు నర్సింహ, సంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో దిష్టి బొమ్మ దహనం చేసిన ముదిరాజ్ యూత్ సభ్యులు
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ ల పట్ల అగౌరవంగా వ్యవహరించి, అసభ్య పదజాలంతో దూషించి నందుకు నిరసనగా ముదిరాజ్ కులస్తులు వేములవాడ బ్రిడ్జి వద్ద అమరవీరుల స్థూపం వద్ద కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
అనంతరం ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ, తమ కులానికి చెందిన వారిపై అసభ్యంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కౌశిక్ రెడ్డి పర్యటించే ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
కోనరావుపేటలో..
ముదిరాజ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
అనంతరం ముదిరాజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్, ముదిరాజ్ తల్లిపాలు తాగి పెరిగానని చెప్తూ ముదిరాజ్ లను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అత్యున్నత పదవులు ముదిరాజులకు కేటాయిస్తూ ఉంటే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లను అవహేళన చేస్తూ అసభ్య పదజాలలను మాట్లాడుతూ యావత్ ముదిరాజ్ జాతిని అవమానించడం బాధాకరం అన్నారు.
కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ జాతికి క్షమాపణలు తెలపాలని లేదంటే గ్రామాలలో తిరగనియ్యకుండా చేస్తామ న్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు అన్నబోయిన సురేష్ కుమార్,ధర్మారం ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు బాబు,ముదిరాజ్ యూత్ సభ్యులు వెంకటేష్, అభిషేక్, సంజీవ్, వెంకటేష్, ప్రశాంత్ , శ్రీకాంత్, అఖిల్ పాల్గొన్నారు.