తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహకు డిప్యూటీ సీఎం పదవి ఖాయం అని ఆపార్టీ శ్రేణులు అంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత
4 సార్లు అసెంబ్లీకి ఎన్నిక
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా, ఏఐసీసీ శాశ్వత సభ్యునిగా, తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుత తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఖాయం అని ఆపార్టీ శ్రేణులు అంటున్నారు.
పరిస్థితులు అనుకూలించకపొతే రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి పదవి లభించనుందని చెబుతున్నారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఇద్దరు మొదటిసారి అసెంబ్లీకి అన్నిక కావడం ఒక్క ఎత్తయితే, ఇద్దరు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.
అతిపిన్న వయసులోనే రోహిత్..
మెదక్ నుండి గెలిచిన మైనంపల్లి రోహిత్ రావు అతిపిన్న వయస్సు కలిగి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి తండ్రి మైనంపల్లి హన్మంతరావుతో పాటు రోహిత్ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ టికెట్ లు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం నుండి గెలుపొందిన పట్లోల్ల సంజీవ రెడ్డి మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి కుమారుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. సంగారెడ్డి సిటింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓడిపోవడంతో సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహకే మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న క్యాబినెట్ లో మంత్రిగా దామోదర్ రాజనర్సింహ పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రి వర్గంలో కూడా మార్కెటింగ్, ఉన్నత విద్యా శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రిగా అయ్యేందుకు ముందు వరసలో ఉన్నారు.
1989 నుంచి దామోదర్ రాజకీయ ప్రస్థానం
1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజక వర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. అప్పటివరకు తండ్రి రాజనర్సింహ మంత్రిగా ఉండి అకాల మరణంతో రాజనర్సింహ రాజకీయాల్లోకి వచ్చారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా 2009 ఎన్నికల్లో అప్పటి మంత్రి బాబూమోహన్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉన్నత విద్యా శాఖ మంత్రిగా దామోదర్ రాజనర్సింహ పదవి బాధ్యతలు చేపట్టారు.
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి దామోదర్ రాజనర్సింహ ను వరించింది. అప్పుడే ఆందోల్ నియోజకవర్గం అభివృద్ది జరిగింది. ఇంజనీరింగ్ , పాల్టెక్నిక్ కళాశాల తో పాటు పీజీ కళాశాల మంజూరు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014,2018, ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై 29,193 ఓట్ల మెజారిటీతో దామోదర్ రాజనర్సింహ గెలుపొందారు.