బీఆరెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వీడిని సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి టార్గెట్ గా ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
తొలి నుంచి ఇద్దరూ బద్ద వ్యతిరేకులు
ఎక్కడున్నా ఎడముఖం పెడముఖం
పట్టాలెక్కిన ఇరువురి మధ్య పాతవైరం
విధాత ప్రత్యేక ప్రతినిధి: బీఆరెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వీడిని సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి టార్గెట్ గా ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. శ్రీహరి చిరకాల ప్రత్యర్ధి డాక్టర్ తాటికొండ రాజయ్యను ఆయుధంగా ప్రయోగిస్తోంది. తమ ఆగ్రహం, అక్కసును రాజయ్య ద్వారా వెల్లగక్కుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి, శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఓడించాలంటే శ్రీహరిని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కడియం శ్రీహరి పై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆరెస్ నాయకులంతా తీవ్రంగా విరుచుకపడుతున్నారు. శ్రీహరిని విమర్శించడం, కావ్యను ఓడించడం తమ లక్ష్యమంటూ శపథాలు చేస్తున్నారు.
విచిత్రమేమిటంటే బీఆరెస్ ను వీడి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన అరూరి రమేష్ ను బీఆరెస్ పెద్దగా పట్టించుకోకపోవడం, విమర్శించకపోవడం చర్చకు దారితీస్తోంది. బీజేపీని తమకు ప్రత్యర్ధిగా భావించడంలేదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరూరి రమేష్ కు బీఆరెస్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిపించింది. మూడవ సారి పోటీకి అవకాశం కల్పించింది. బీఆరెస్ జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించింది. అయినప్పటికీ పార్టీని విడిచి వెళ్ళారు.
రాజయ్యకు తిరిగి బీఆరెస్ అవకాశం
మొన్నటి ఎన్నికల్లో తనకు జరిగిన అవమానం, అన్యాయంతో డాక్టర్ రాజయ్య పార్టీని వీడారు. తాజాగా ఎంపీ టికెట్ దక్కతుందని ఆశించినా డాక్టర్ రాజయ్యకు ఆశాభంగమే కలిగింది. కడియం శ్రీహరి పార్టీని వీడిన తర్వాత రాజయ్యను తిరిగి బీఆరెస్ లోకి తీసుకొచ్చారు. చేరడమే ఆలస్యం రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ బీఆరెస్ ఇంచార్జ్ గా నియమించారు. రాజయ్య కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి బీఆరెస్ లో చేరినట్లు చెబుతున్నారు. శనివారం రాజయ్య చేరగానే సోమవారం స్టేషన్ ఘన్ పూర్ లో బీఆరెస్ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శ్రీహరి పై తీవ్రంగా విమర్శించారు. పాల్గొన్న నాయకులంతా మాటల దాడి చేశారు .రాజయ్య అయితే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని గమనిస్తే కడియం పై రాజయ్యను ఉసిగొల్పినట్లుగా భావిస్తున్నారు. ప్రధానంగా రాజయ్య అక్రమ సంపదనంతా బయటపెడుతానంటూ ప్రకటించారు. హవాలా ద్వారా ఆయన సంపాదించిన అవినీతి సొమ్మును ఇతర దేశాలకు తరలించారని తీవ్రంగా ఆరోపించారు. త్వరలో వాటిని ఆధారాలతో సహా బయటపెడుతానంటూ హెచ్చరించారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న బీఆరెస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కడియం బీఆరెస్ కు అన్యాయం చేసినట్లుగానే కాంగ్రెస్ కు నష్టం చేస్తారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు శ్రీహరి పైన్నే విమర్శలు చేయడం గమనార్హం. ఒక విధంగా బీఆరెస్ లో సెంటిమెంట్ గా మారింది. దీనికి తోడు ఉద్యమకారుడు మారపల్లి సుధీర్ కుమార్ కు ఎంపీ టికెట్ ఇచ్చామనే అంశానికి ప్రాధాన్యతనివ్వడంతో కొంత సెంటిమెంట్ గా మారుతోందని ఆశిస్తున్నారు.
బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల అవకాశాలు అనుభవించిన కడియం శ్రీహరి ఆ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని ఆ పార్టీ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను ఒక విధంగా అవమానించినంతపనిచేసి టికెట్ నిరాకరించడం ఒక ఎత్తైతే….తన చిరకాల ప్రత్యర్ధి కడియం శ్రీహరికి ఆ అవకాశం కల్పించడం రాజయ్య జీర్ణించుకోలేకపోయారు. అత్త తిట్టినదానికంటే తోటికోడలు నవ్వడంవల్లే అనే సామెత రాజయ్యకు తీవ్ర ఇబ్బందికి గురిచేసింది.
ఈ కారణంగానే బీఆరెస్ ఓడిపోగానే పార్టీకి రాజీనామా చేశారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో చేరడానికి సానుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు తన బద్ద వ్యతిరేకి కడియం పార్టీని వీడడంతో రాజయ్య మరోసారి గులాబీ గూటికి చేరారు. పార్టీ ఇంచార్జ్ గా తిరిగి తన రాజకీయ ప్రస్థానం స్టేషన్ ఘన్ పూర్ లోనే చేపట్టేందుకు అవకాశం ఉందని భావించినట్లు చెబుతున్నారు. కడియం పై రాజయ్య చేసిన ఆరోపణల ప్రభావం ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. కడియం ప్రతిస్పందన ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పట్టాలెక్కిన పాత వైరం
ఇదిలా ఉండగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు తొలి నుంచి వైరి వర్గాలే. కడియం టీడీపీలో రాజయకీయ రంగప్రవేశం చేస్తే రాజయ్య కాంగ్రెస్ తో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంగా రాజకీయ వైరి వర్గాలుగా ఉన్నారు. ఎన్నికల్లో ఇరువురూ పోటీపడుతూ వచ్చారు. చివరికి ఉద్యమకాలంలో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి బీఆరెస్ నుంచి పోటీ చేస్తే ప్రత్యర్ధిగా టీడీపీ నుంచి కడియం శ్రీహరి పోటీచేశారు.
కడియం శ్రీహరి బీఆరెస్ లో చేరిన తర్వాత కూడా ఇద్దరూ ఉప్పూనిప్పూగానే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన స్థానానికి కడియం ఎసరుపెట్టారని రాజయ్య మండిపడ్డారు. ఒకరినొకరు బహిరంగంగా తిట్టిపోసుకున్నారు. ఒక్క పార్టీలో ఉన్నా ఎడమొగం, పెడమొగంగా కొనసాగారు. తాజాగా ఇరువరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నందున మరోసారి పాత రాజకీయ వైరం తాజాగా పట్టాలెక్కింది.