విధాత బ్యూరో, కరీంనగర్: సీపీఐ పార్టీ జాతీయ హోదా రద్దు చేయడం మోడీ ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు నిదర్శనమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
సోమవారం హుజూరాబాద్ లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.దేశంలో ఎమ్మెల్యేకు, ఎంపీలకు వెలగట్టే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నీళ్లు, నిధులు, నియామకాలపై ఉమ్మడి అసెంబ్లీలో సిపిఐ పక్ష నేతగా కొట్లాడింది తానే అని గుర్తు చేశారు.
తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంత మంది పేద ప్రజలకు డబుల్ బెడ్రూములు ఇచ్చిందో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ బిజెపి హిందు మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తుందని ఆరోపించారు.
పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్రప్రభుత్వం దోబూచులాడుతుందనన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో విఫలం అయిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్, సీపీఐ మండలం నాయకులు రవీందర్ రెడ్డి, రాజు, చంద్రన్న, కొమురు మల్లు తదితరులు పాల్గొన్నారు.