భారత రాష్ట్ర సమితి ఏర్పాటు అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నాయకులు, రైతు సంఘాల నేతలు కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్కు చేరుకున్న భగవంత్ సింగ్ మాన్కు కేసీఆర్ పూలబొకేతో సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దేశంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పంజాబ్ సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. ఈ చర్చల అనంతరం, సీఎం కేసీఆర్.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు శాలువా కప్పి, మెమొంటో బహూకరించి వీడ్కోలు పలికారు.
ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎస్ మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ ఎస్ వేణుగోపాల చారి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, రాష్ట్ర బిసి కమిషన్ మాజీ సభ్యులు ఈడిగ ఆంజనేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.