కేసీఆర్ అరాచక పాలనపై విద్యార్థులు ఎందుకు నడుం బిగిస్తలే:. రేవంత్ రెడ్డి
Revanth Reddy | అరాచక పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పై పోరాటం చేసేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందుకు రావాలి.. మేల్కొనాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. ఈ తెలంగాణలో అరాచకం జరుగుతుంటే, రాచరిక పోకడలు కొనసాగుతుంటే చంద్రశేఖర్ రావును తుద ముట్టించేందుకు యూనివర్సిటీల విద్యార్థులు ఎందుకు నడుం […]

Revanth Reddy | అరాచక పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పై పోరాటం చేసేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందుకు రావాలి.. మేల్కొనాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు.
ఈ తెలంగాణలో అరాచకం జరుగుతుంటే, రాచరిక పోకడలు కొనసాగుతుంటే చంద్రశేఖర్ రావును తుద ముట్టించేందుకు యూనివర్సిటీల విద్యార్థులు ఎందుకు నడుం బిగిస్తలేరని అడుగుతున్నా. తెలంగాణలో అరాచకం కొనసాగుతుంటే.. ఎందుకు ముందుకు వస్తలేరు. శ్రీకాంతాచారిని, ఇషాన్ రెడ్డి, యాదయ్య, వేణగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, సురేశ్ నాయక్ను మరిచిపోయారు.
తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్ ఉండాలని, ఉపాధి హామీ పనులకు వెళ్లి తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి.. యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు పంపించి, ఉన్నత చదువులు చదివించారు. ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డలను మీరు మరిచిపోయారా? మోదీ, కేసీఆర్ కలిసి అనాగరికంగా మనపై దాడి చేస్తుంటే ఆ అమరవీరులు గుర్తుకు వస్తలేరా? అని అడుగుతున్నా.
ఇవాళ పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై లేదా? అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాల్సిన బాధ్యత, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత, చదువుకునే విద్యార్థులకు విద్యను అందించే బాధ్యత ఈ పాలకుల మీద లేదా? ఇవన్నీ అమలు చేయని పాలకులను తుదముట్టించే బాధ్యత మన మీద లేదా? అని అడుగుతున్నాను అని రేవంత్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ సుపుత్రుడు రాహుల్ గాంధీకి అండగా నిలబడినందుకు, భారత్ జోడో యాత్రను విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడ్డ మీ అందరికి మా నాయకుల చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి.. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులను కట్టించింది. ఉద్యోగాలను సృష్టించింది. కరెంట్ సమస్యలను అధిగమించింది. కానీ 8 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఈ దేశాన్ని విధ్వంసం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేస్తున్నారు. స్వయం పాలన కావాలని, సామాజిక పాలన కావాలని తెలంగాణ ప్రజలు అడిగితే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ పోరాటాన్ని సోనియా గౌరవించారు. ఇవాళ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఆగమైంది అని రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తారు.
తెలంగాణ మేధావులు ఎక్కడ దాక్కున్నారు..?
తెలంగాణ మేధావులు అమరవీరుల త్యాగాలను మరిచిపోయారా? అమరవీరులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ పాలకులపై లేదా? తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలకు పరిష్కారం, సామాజిక న్యాయం వస్తదన్నారు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ అమ్ముడు పోయారని మండి పడ్డారు.
తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే.. మీరు కేసీఆర్కు ఎందుకు లొంగిపోయారని అడుగుతున్నా మీరు చెప్పిన మాటలు విని మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చారు. తెలంగాణ మేధావులు ఆలోచించాలి. కేంద్రం, రాష్ట్రం ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తోంది. ఈ దేశాన్ని అంతమొందించేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు. కడుపు మండి, గుండె రగిలి.. ఈ జాతి కోసం ప్రాణాలను ఆర్పించేందుకు రాహుల్ గాంధీ ముందుకు వచ్చారని రేవంత్ పేర్కొన్నారు.
గాంధీ కుటుంబంపై ఈడీ దాడులా..?
పదేపదే గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ.. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అన్నివర్గాల ప్రజలకు టీఆర్ఎస్, బీజేపీలు అన్యాయం చేశాయన్నారు. పదే పదే గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరు ఆలోచన చేయాలన్నారు. దాడులు చేస్తున్నారు. ఈడీని పిలుస్తున్నారు.
రాహుల్గాంధీ ప్రధాని అయితే అన్ని సమస్యలు తొలిగిపోతాయన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అవినీతికి పాల్పడుతుందా? అని ప్రశ్నించారు. దేశానికే ఆదర్శంగా సోనియాగాంధీ, రాహుల్గాంధీ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దేవుడి ముందు కూడా చెప్పుకోలేని సమస్యలు రాహుల్ గాంధీ ముందు చెప్పుకున్నారు. మోడీ, కేసీఆర్ గాలిలో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారు అని రేవంత్ మండిపడ్డారు.