Rythu Bharosa: పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పైసల్ : మంత్రి తుమ్మల

వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నల్లగొండలో అయిల్ ఫామ్ కంపనీ ఏర్పాటు
సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించాలి: మండలి చైర్మన్ గుత్తా
Rythu Bharosa: : రైతు భరోసా నిధులు రానున్న పది రోజుల రైతుల ఖాతాలలో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా, చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించి..చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వానాకాలం రైతులు నాట్లు పెట్టకముందే రైతు ఖాతాలలో రైతు భరోసానిధులు వేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని.. ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనన్నారు. తొలకరి ముందుగానే వచ్చినందునా రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని, అకాల వర్షాలు, అనుకొని సంఘటనలు జరిగినప్పుడు తట్టుకొని నిలబడే విధంగా రైతు పంటలు వేసుకోవాలని, ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వంటి మార్కెటింగ్ డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. నల్గొండ జిల్లాలో త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి నిచ్చే కొత్త పంటలను పండించాలని ఆయన పిలుపునిచ్చారు. జాజి, ఒక్క, పామాయిల్ వంటి పంటలను సాగు చేయాలని ,అలాగే ఇతర కొత్త పంటల ఆవిష్కరణకు రైతులకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరి పత్తితో పాటు ,మనకు అవసరమయ్యే పంటలను పండించాలని, పంటలు బాగా పండాలంటే పురుగుమందులు, యూరియా వాడకం తగ్గించాలని, సాంప్రదాయ వ్యవసాయానికి వెళ్లాలని, వ్యవసాయాన్ని పండుగ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళుతున్నామని, చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ లో ఉన్న 8 గ్రామాలను చిట్యాల మార్కెట్ యార్డ్ లోకి విలీనం చేయడం, నార్కెట్ పల్లి సబ్ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన పనులు, గోడౌన్ మంజూరు విషయం ఆలోచిస్తామని తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు బీమా, విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో రైతుకు అందజేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పండించగలుగుతాడని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించిందని అన్నారు. రోహిణి కార్తిలోనే వర్షాలు వచ్చినందున రైతులు ముందే నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని, వారం, పది రోజుల్లో రైతు భరోసా వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీలకు ప్రత్యేక స్థానం ఉందని, మార్కెట్లకు ఉన్న పేరు ప్రతిష్టాలను కాపాడాల్సిన బాధ్యత కొత్త మార్కెట్ కమిటీల పై ఉందని చెప్పారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణలో పరిపాలన కొనసాగుతున్నదని, చిట్యాల జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం విషయమై జాతీయ రహదారి సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డ్ పరిధిలోకి వచ్చే ఎనిమిది గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ యార్డులో ఉన్నాయని, వాటిని చిట్యాల మార్కెట్ యార్డ్ లో విలీనం చేయాలని ,నార్కెట్ పల్లి సబ్ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన పనులను పూర్తి చేయటం , గోడౌను చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు మంచి పేరు ఉందని, దీనిని ఆలాగే కొనసాగించాలని కోరారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నదని, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కై రూపొందించిన గోడ పత్రికను మంత్రి ఆశ వర్కర్లతో కలిసి ఆవిష్కరించారు. చిట్యాల నూతన వ్యవ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్రా వినోద ,వైస్ చైర్మన్ గా ఐత రాజు యాదయ్య తోపాటు ,మరో పదహారు మంది సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారికి మంత్రి,ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ,వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.