Rythubandhu | రైతులకు గుడ్న్యూస్.. జూన్ 26 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
Rythubandhu ఈనెల 24 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు తీసుకోండి పైసలు పోయినా ఫర్వాలేదు.. పంటలు కాపాడండి అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ విధాత: వానాకాలం సాగు పెట్టుబడికి ఈనెల 26వ తేదీ నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎప్పటి లాగే రైతు బంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఈ మేరకు వెంటనే […]
Rythubandhu
- ఈనెల 24 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ
- వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు తీసుకోండి
- పైసలు పోయినా ఫర్వాలేదు.. పంటలు కాపాడండి
- అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
విధాత: వానాకాలం సాగు పెట్టుబడికి ఈనెల 26వ తేదీ నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎప్పటి లాగే రైతు బంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును, ఈశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులను ఆదేశించారు.
అలాగే పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులకు ఈనెల24 నుంచి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే పోడు రైతులకు రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయాన్ని రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంట సాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. “పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలని’ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిరంతరాయంగా తాగునీటి కోసం ముందస్తు చర్యలు
వాతావరణ శాఖ అంచనాల మేరకు జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటిని విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.
రిజర్వాయర్లలో నీటిని నింపి ఉంచాలని ఆదేశం
జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుండి సీఎం ఆరా తీశారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్ల లో నీటి నిల్వ వివరాలను సీఎం ఆరా తీశారు.
ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో మూడు టిఎంసిలకు గాను 0.69 టిఎంసిల నీటి నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజనీర్లు తెలుపగా, రంగనాయక సాగర్ కు రెండు టిఎంసిల నీటిని మిడ్ మానేరు జలాశయం నుండి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను సిఎం ఆదేశించారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరందించడానికి వీలవుతుందని అన్నారు.
ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టిఎంసిల నీటి నిల్వలు ఆగష్టు చివరి వరకు 3 తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టిఎంసిలు అవసరమని ఇంజనీర్లు సూచించారు. దీని కోసం ఆగష్టులో 5 టిఎంసిలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్ కు తరలించాలని సమావేశం నిర్ణయించింది.
ఆగష్టు నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టిఎంసిల నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు.
ఈ సంవత్సరం మల్లన్నసాగర్ లో మరో 10 టిఎంసిలు నింపాలని నిర్ణయం జరిగింది. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయి. రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
దీని కోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయం పై ఒక ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సాగునీటి శాఖ సన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి సూచించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై సమీక్ష
పాలమూరు రంగారెడ్డి పనులను సిఎం కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగష్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి పనులను తొలగించి వాటిని సమర్థులైన కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. అదే విధంగా తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుండి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం సూచించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ. 4252.53 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని ఈఎన్సి మురళీధర్ తెలిపారు. కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి ప్రాజెక్టు డిపిఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని ఈఎన్సి సీఎం గారిని కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీలు శ్రీధర్ రావు దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు, శంకర్, చీఫ్ ఇంజనీర్లు హమీద్ ఖాన్, రమణా రెడ్డి, శ్రీనివాస్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.