Jagga Reddy |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ పీసీసీ అసోసియేట్ అధ్యక్షులు జగ్గారెడ్డి, ఆయన సతీమణి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో సహా , వారి అనుచరులు మెదక్ లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ స్వయంగా దృష్టి పెట్టి గులాబీ గూటికి వచ్చే విధంగా ఫోకస్ పెట్టారు.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సహితం కేటీఆర్ చాంబర్లో జగ్గారెడ్డి మంతనాలు జరిపినప్పుడే పార్టీ మార్పుపై ఊహాగానాలు రేగాయి. జిల్లా మంత్రి హరీశ్ రావు తో జగ్గారెడ్డికి పొసగని విషయం తెలిసిందే. ఐనప్పటికీ జగ్గారెడ్డితో సీఎం కేసీఆర్, కేటీఆర్లు స్వయంగా టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ అభ్యర్ధి రాష్ట్ర చేనేత అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ నాయకులపై స్పెషల్ ఫోకస్
మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలపై సీఎం కేసీఆర్, స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సీఎం కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలువాలన్న తలంపుతో ఉన్నారు. ఇప్పటికే జహీరాబాద్ నియోజక వర్గంలో మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నరోత్తం, రిటైర్డ్ ఉద్యోగులు సీఎం సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
రాజనర్సింహకు సహితం సీఎం ఫోన్..?
ఇదిలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు సహితం స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన నుండి స్పందన కోసం బీఆరెస్ పార్టీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గజ్వేల్, నర్సాపూర్, మెదక్, పటాన్ చెర్వు, దుబ్బాక, తదితర నియోజక వర్గాల ముఖ్య నాయకులను సహితం కేటిఆర్, మంత్రి హరీశ్రావు సంప్రదిస్తున్నట్లు సమాచారం