Himalayas
విధాత: హిమాలయాలు (Himalayas) ఏర్పడటానికి పూర్వం అక్కడ ఉన్న మహాసముద్రం ఆనవాళ్లను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇప్పటికి సుమారు 60 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భారీ సముద్రం ఉండేదని అంచనా. దానికి సంబంధించిన జల అవశేషాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు, నిగాట యూనివర్సిటీ ఆఫ్ జపాన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారు. ఆ పురాతన సముద్రం ఎండిపోయిన తర్వాత మిగిలిన మినరల్స్ నుంచి ఈ నీటిని సేకరించారు.
ఈ అవశేషాలను పరిశీలించగా ఆ నీటిలో కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్స్ పెద్ద ఎత్తున ఉన్నాయని బయటపడింది. ఈ పరిశోధన ద్వారా భూమి పరిణామక్రమంలో జరిగిన ఆక్సిజనేషన్ ప్రక్రియ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ‘మేము కనుగొన్న ఈ మినరల్ అవశేషాలు సముద్రానికి సంబంధించినంత వరకు టైమ్ క్యాప్సుల్స్ లాంటివి. వాటిల్లో మనకు కావాల్సిన సమాచారం అంతా ఉంటుంది’ అని ఐఐఎస్సీ పీహెచ్డీ విద్యార్థి ప్రకాష్ చంద్ర ఆర్య పేర్కొన్నారు.
పరిశోధకుల అంచనా ప్రకారం.. సుమారు 70 నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మంచు పొరలతో కప్పబడి ఉండేది. తదనంతర కాలంలోనే భూమిపై ఆక్సిజనైజేషన్ ప్రక్రియ ప్రారంభమై భూ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగాయి. తద్వారా జీవజాలం ఉద్భవించడానికి పరిణామం చెందడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు భూమిపై ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి వరకూ ఇది కేవలం ఒక ఊహగా ఉంటూనే వస్తోంది. దీనిని నిర్ధరించడానికి గానీ.. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి కానీ కావాల్సిన మూలకాలు లభించలేదు.
ప్రస్తుతం హిమాలయాల్లో దొరికిన ఈ మినరల్స్ అవశేషాలు ఈ లోటును తీరుస్తాయని ఒక అంచనా. ప్రస్తుతం ఉన్న సముద్రాలకు పురాతన సముద్రాలకు ఉన్న తేడా ఏంటి? అవి క్షార గుణంతో ఉండేవా ఆమ్ల గుణంతో ఉండేవా? మినరల్స్తో ఉండేవా లేదా? సముద్ర జలాలు వెచ్చగా ఉండేవా? ఇలా అప్పటి సముద్రాల గురించి మనకేమీ తెలియదు అని ప్రకాష్ పేర్కొన్నారు. ఈ విషయాలు తెలిస్తే తప్ప భూగోళం చరిత్ర గురించి మనం నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేమని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఏమి కనుగొన్నారు?
పరిశోధకులు కనుగొన్న సముద్ర అవశేషాల్లో కాల్షియం లేకపోవడాన్ని గుర్తించారు. నదుల నుంచి పెద్ద మొత్తంలో ప్రవాహాలు లేకపోవడమే దీనికి కారణం. సముద్రపు నీటిలో ఉన్న తీవ్రమైన కాల్షియం కొరత..అక్కడ మెగ్నిషియం స్థాయులు పెరగడానికి కారణమైంది. ఈ పరిస్థితి ఫొటో సింథటిక్ సైనోబ్యాక్టీరియా పెరగడానికి మంచి పరిస్థితులను సృష్టించి ఉంటుంది.
ఇవి తగిన స్థాయిలో వృద్ధి చెంది ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం ద్వారా భూమిపై ఆక్సిజనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయని ఐఐఎస్సీ పరిశోధకులు వెల్లడించారు. అమృతపూర్ నుంచి మిలామ్ గ్లేసియర్ వరకు ఉన్న పశ్చిమ కుమావ్ హిమాలయాలు, డెహ్రాడూన్ నుంచి గంగోత్రి వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించి పురాతన సముద్ర అవశేషాలను కనుగొన్నారు.