- ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో లక్షా 32 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీ
విధాత: ఉద్యోగాల భర్తీ పై తాము చర్చకు సిద్ధమని, అందుకు కాంగ్రెస్ బిజెపిలు సిద్ధంగా ఉన్నాయా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది ఏళ్లలో లక్షా 32 వేల 632 ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన వెల్లడించారు.
ఈ మేరకు బుధవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పి చైర్మన్ దీపికా యుగందర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు గాధరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి లతో కలసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో పది ఏళ్ల నుండి పదివేల ఉద్యగాలను భర్తీ చెయ్యలేకపోయిన కాంగ్రెస్, బిజెపి లు నిరుద్యోగ మార్చ్ అంటూ హడావుడి చెయ్యడం ముమ్మాటికి నిరుద్యోగులను వంచనకు గురి చెయ్యడమేనని ఆయన దుయ్యబట్టారు.
నిరుద్యోగ మార్చ్ చెయ్యాల్సి వస్తే అది గల్లీలో కాదని ఢిల్లీలో చేయాలని ఆయన ఉద్బోధించారు. ఇక్కడ చేసేది రాజకీయ నిరుద్యోగ మార్చ్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే యేటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అంటూ మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీకీ వ్యతిరేకంగా చెయ్యాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
యేటా రెండు కోట్లు ఉద్యోగాలు కాదు.. సంవత్సరానికి రెండు లక్షల మంది ఉద్యోగులను వీధిన పడేసిన ఘనత ప్రధాని మోడీదని ఆయన దుయ్యబట్టారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీగా మారిందన్నారు. అటువంటి పార్టీకీ తెలంగాణలో ఉన్నదే నాలుగు ఈకలని, ఆ నాలుగు ఈకలు కూడా ఎవరీ గోలలో వాళ్లే ఉన్నారని ఆయన ఎత్తి పొడిచారు.
బిజెపి ఆడుతున్న క్షుద్ర రాజకీయాలలో లీకేజీల ప్రహసనం ఒక భాగమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లీకేజీలో అడ్డంగా దొరికిపోయారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజేపికి బీ-టీం గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.