Suryapeta
విధాత: కరోనా సమయంలో రాష్ట్ర వైద్య సిబ్బంది సేవలు ఆమోఘమైనవని.. ఆసమయంలో మన సూర్యాపేట వైద్య సేవలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువచ్చిన ప్లోరెన్స్ నైటింగేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచి మాట్లాడారు.
అమ్మ తరువాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదే అని.. వైద్యరంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఆరోగ్య రక్షణలో వారు ఎనలేని తోడ్పాటునందిస్తున్నారని కొనియాడారు. పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయన్నారు.
ప్రారంభం నాటి నుంచి అద్భుతమైన సేవలందిస్తున్నామని.. రాబోయే రోజుల్లోనూ మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కా భవనం పూర్తయిందని.. త్వరలోనే నర్సింగ్ తో పాటు అన్ని పక్కా భవనాలు నిర్మించుకుందామన్నారు. సూర్యాపేటలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా సేవలందించాలని ఆకాక్షిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అహర్నిశలు కష్టపడి చదవి వారి కుటుంబాలకు, పేట కళాశాలకు మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించాలన్నారు.
ఈ వేడుకల్లో DMHO కోటా చలం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరెంటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శారదా దేవి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.