పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ను వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లభించలేదని, ప్రజలచేత ఎన్నుకున్న నాయకులు అనే విషయాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారన్నారు.
స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, స్థానిక సంస్థలను పటిష్టంగా తయారు చేసినప్పుడే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, స్థానిక సంస్థల బలోపేతానికి కృతనిశ్చయంతో ఉన్నామని మహబూబ్ నగర్ లో జరిగిన సభలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్బంగా యెన్నం గుర్తు చేశారు.
ఎంపిటిసిలు కేవలం ప్రజల చేత ఎన్నుకోబడిన వారిగా మాత్రమే గుర్తింపు ఉందని, వారు ప్రజలకు ఏవిధమైన సంక్షేమ ఫలాలు అందించలేని దుర్లభమైన స్థితిలో ఉన్నారన్నారు. ఎంపిటిసి ల ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతిఒక్కరు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, అందుకే మేము ప్రజాస్వామ్య పద్దతిలో మా పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి ఓటు వేయాలని అభ్యర్థించామన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలు చేయలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం లో ఉన్నామన్నారు. కానీ దేశం లో చక్రం తిప్పుతామని, కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారాలు నిర్వహించుకున్న కల్వకుంట్ల వారసుడు ఇప్పుడు కేవలం ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం దిగజారుడు రాజకీయాలకు చేస్తూ గోవాలో ఎంపిటిసి సభ్యుల తో కలిసి జల్సాలు చేస్తున్నారని, అక్కడ ఆయన ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని యెన్నం విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నించినా ఫలితం మా వైపే ఉందని, 80 శాతం ఎంపిటిసి లు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. బీ ఆర్ ఎస్ నేతలు వ్యాపారులను, రాజకీయ నాయకుల ను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం ధ్వంసం చేసి నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. పోలీసు వ్యవస్థ ను సైతం నిర్విర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. అందుకే ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, స్వచ్చందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కి అండగా ఎంపిటిసి లు నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.