Warangal | ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై అసమ్మతిగళం.. మానుకోట గులాబీ శిబిరంలో కుంపటి

Warangal అసంతృప్తుల ప్రత్యేక సమావేశం ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా కోరు అప్రమత్తమైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట గులాబీ శిబిరంలో కుంపటి రాజుకుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆ పార్టీలోని ఒక వర్గం అనుచరులు తిరుగుబాటు ప్రదర్శిస్తున్నారు. శంకర్ నాయక్ స్థానంలో ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని మరీ శంకర్ నాయక్ పై తిరుగుబాటు జెండా ఎగరడం వెనక […]

  • Publish Date - July 8, 2023 / 01:10 PM IST

Warangal

  • అసంతృప్తుల ప్రత్యేక సమావేశం
  • ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా కోరు
  • అప్రమత్తమైన ఎమ్మెల్యే శంకర్ నాయక్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట గులాబీ శిబిరంలో కుంపటి రాజుకుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆ పార్టీలోని ఒక వర్గం అనుచరులు తిరుగుబాటు ప్రదర్శిస్తున్నారు. శంకర్ నాయక్ స్థానంలో ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని మరీ శంకర్ నాయక్ పై తిరుగుబాటు జెండా ఎగరడం వెనక నియోజకవర్గానికి చెందిన ఒక ప్రధాన నాయకుడి హస్తం ఉన్నట్లు అర్థమవుతుంది. ఆయన అనుచరులే మొదట శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా గొంతెత్తినట్లు భావిస్తున్నారు.

ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్, గూడూరు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

శంకర్ నాయక్ ఆశలపై అసమ్మతి నీళ్లు

నిన్నటి వరకు సమస్య సమసిపోయి ముచ్చటగా మూడోసారి కూడా శంకర్ నాయక్ కు ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని చర్చ ప్రారంభం అయిందో లేదో అప్పుడే అసమ్మతి శిబిరం గళ‌మెత్తడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. గురువారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా టికెట్ నీకే అంటూ, వచ్చే ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డ మరుసటి రోజే ఈ పరిణామం జరగడం గమనార్హం.

కేటీఆర్ పర్యటన సందర్భంగా సందేహాలు

ఈ మధ్య పోడు పట్టాల పంపిణీ సందర్భంగా మానుకోటకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు తిరిగి టికెట్ కేటాయించే విషయమై స్పష్టమైన ప్రకటన చేయకుండానే వెళ్లారు. దీంతో ఈసారి శంకర్ నాయక్ టికెట్ గల్లంతే అని చర్చ జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే సీఎంను కలవడం, ఆయన భరోసా ఇవ్వడంతో మళ్లీ శంకర్ నాయక్ పోటీలో ఉంటారని చర్చ ప్రారంభమైంది. అయితే వెనువెంటనే ఈ అసమ్మతి పరిణామం జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఉన్న లుకలుకలు, గ్రూపుల అధిపత్యానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు.

టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి సూచన

ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు మ‌ళ్లీ టికెట్ ఇవ్వొద్ద‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని కొందరు ముఖ్య నాయకులు అధిష్ఠానానికి స్ప‌ష్టం చేశారు. శంక‌ర్‌నాయ‌క్‌కు కాకుండా కొత్త‌గా ఎవ‌రిని నిల‌బెట్టినా గెలిపించుకుంటామ‌ని, లేద‌ని ఆయ‌న‌కే మ‌ళ్లీ టికెట్ ఇవ్వ‌ద‌ల్చుకుంటే మాత్రం స‌హ‌క‌రించేది లేద‌ని తెగేసి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ముడుపుగల్లులో కేడర్ సమావేశం

మానుకోట మండ‌లం ముడుపుగ‌ల్ గ్రామ శివారులోని ఓ మామిడితోట‌లో శ‌నివారం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆయా మండ‌లాల‌కు చెందిన కొంత‌మంది బీఆర్ ఎస్ పార్టీ లీడ‌ర్లు జెరిపోతుల వెంక‌న్న అధ్యక్షతన స‌మావేశ‌మ‌య్యారు. శంక‌ర్‌నాయ‌క్ వ‌ద్దు కొత్త‌వారైనా ముద్దు అనే రాజ‌కీయ నినాదంతో బీఆర్ ఎస్ నేత‌లు చేపట్టిన ఈ సమావేశం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసింది. రాజ‌కీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అవినీతి పరుడు, కబ్జాకోరు

అవినీతి పరుడు, కబ్జా కోరు అంటూ అసభ్య పదజాలం వాడుతూ నియోజకవర్గంలో ప్రజలను, కార్యకకర్తలను, ఉద్యమకారులను, అధికారులను ఇబ్బది పెడ్తున్న ఎమ్మెల్యే మాకొద్దంటూ సమావేశంలో నేత‌లు ముక్త‌కంఠంతో వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. శంక‌ర్‌నాయ‌క్‌కు టికెటిస్తే ఓడిపోవడం ఖాయమ‌ని అన్నారు. ఆయ‌న‌కు నియోజకవర్గ అభివృద్ధి కంటే దందాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ధ్వ‌జ‌మెత్తారు.

ఉద్యమకారులను ముఖ్యనాయకులను పక్కన పెట్టి దగా కోరులను రౌడీ షీటర్లకు పదవులు కట్టబెడుతూ నియోజకవర్గంలో వ్యతిరేకత తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. అతనికి తప్ప ఇంకెవరు ఇచ్చినా పార్టీ గెలుపుకు కృషి చేస్తామ‌ని స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన‌ జెరిపోతుల వెంకన్న చెప్ప‌డం విశేషం. ఇంతకుముందు ఎమ్మెల్సీ రవీందర్రావు సూచన మేరకు తామంత శంకర్ నాయక్ విజయానికి కృషి చేసినట్లు చెప్పారు.

మూడుపుగల్లు సమావేశంలో మ‌హ‌బూబాబాద్ మునిసిపాలిటీ కౌన్సిల‌ర్లు ఎడ్ల వేణు, హరినాయక్, నిమ్మల సీను, అరేంపుల విజయమ్మ , కేసముద్రం సర్పంచ్ బట్టు శ్రీను, మంగళపల్లి కన్నా, మాదారబోయిన యాకయ్య, జీలకర యాలాద్రి, కరుణాకర్ రెడ్డి, పుచ్చకాయల రామకృష్ణ, దేవేంద్ర చారి, అయిలి సంతోష్ గౌడ్, విజయ్, లింగన్న, మడత వెంకన్న, వెంకటాద్రి, కె.రాము, మహేందర్ రెడ్డి, కత్తుల మల్సుర్, కొప్పు శ్రీను, వెంకట్ రెడ్డి, మురళిపద్మ, మ‌రికొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.