CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
కేసీఆర్..శాసనసభకు రండి..సూచనలివ్వండి
అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామంటే..గుణపాఠం తప్పదు

CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధికి..నిధుల సాధనకు ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తామని..కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని..అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ లో ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని..ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుని నిరుద్యోగ యువతను మోసం చేశారని రేవంత్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నానని..శాసనసభకు రండి..ప్రజా సమస్యలపై చర్చించండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి.. సరిదిద్దుకుంటామన్నారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలన్నారు. గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని..ఒక్క రోజు కూడా ప్రజా సేవలో సెలవు..విశ్రాంతి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేను ఏనాడు అహంభావం ప్రదర్శించలేదన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నేను నిద్రపోయేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హామీల అమలు దిశగా ప్రజాప్రభుత్వం ముందడుగు

ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నామని..ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పామని..స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని..27వేలకోట్ల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని తెలిపారు. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం.. భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నామని చెప్పారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని..రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.

మెదక్ అంటేనే ఇందిరమ్మ
ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుందన్నారు. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మ అని పేర్కొన్నారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు.

నిమ్జ్ నిర్వాసితులకు భరోసా
గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదికగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని నా దృష్టికి తీసుకొచ్చారని..నారాయణఖేడ్ కు సురేష్ షెట్కర్, సంజీవరెడ్డి రెండు కళ్లలంటివారన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

అంతకుముందు జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో శ్రీ బసవేశ్వర మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఝరాసంగం మండలం మచ్నూర్ లో కేంద్రీయ విద్యాలయంను ప్రారంభించారు. సభా ప్రాంగణం వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం, మంత్రులు సందర్శించారు. మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, టి.జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.