Yuva Galam | సీఎం జగన్‌.. ఇలాకాలో ఫ్యాన్‌కు ఉక్కపోత!

హోరెత్తుతున్న లోకేశ్‌ యువగళం వైసీపీ శ్రేణుల్లో కడప కలవరం! టీడీపీ వీక్ అనుకున్న చోట పీక్‌లో ఇంతటి మార్పు దేనికి సంకేతం? విధాత: ఏపీలో వైసీపీ ఉలిక్కి పడే పరిణామాలు.. ఫ్యానుకు ఉక్కపోసే పరిస్థితులు.. కంచుకోటలు బద్దలు అయ్యే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ 117 రోజుల క్రితం మొదలు పెట్టిన యువగళం (Yuva Galam) పాదయాత్రను లైట్‌గా తీసుకున్న వైసీపీకి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన యాత్ర ఒక ఎత్తు […]

  • Publish Date - June 7, 2023 / 07:34 AM IST

  • హోరెత్తుతున్న లోకేశ్‌ యువగళం
  • వైసీపీ శ్రేణుల్లో కడప కలవరం!
  • టీడీపీ వీక్ అనుకున్న చోట పీక్‌లో
  • ఇంతటి మార్పు దేనికి సంకేతం?

విధాత: ఏపీలో వైసీపీ ఉలిక్కి పడే పరిణామాలు.. ఫ్యానుకు ఉక్కపోసే పరిస్థితులు.. కంచుకోటలు బద్దలు అయ్యే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ 117 రోజుల క్రితం మొదలు పెట్టిన యువగళం (Yuva Galam) పాదయాత్రను లైట్‌గా తీసుకున్న వైసీపీకి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన యాత్ర ఒక ఎత్తు అయితే.. యువగళం కడప గడపలో అడుగుపెట్టిన తరువాత కనిపిస్తున్న సీన్, వైబ్రేషన్ మరో ఎత్తు అని చెప్పవచ్చు.

నాలుగు నెలల క్రితం లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు హేళన చేసిన వైసీపీ ఇప్పుడు తీవ్ర ఆలోచన చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రభుత్వం కలిగించిన అడ్డంకులు, సృష్టించిన సమస్యలను దాటుకుని.. రాటు దేలి యాత్ర సాగుతోంది. చిత్తూరులో మొదలైన యువగళం అనంతపురం జిల్లాకు వచ్చే సరికి మార్క్ కనిపించింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కర్నూలులో కూడా యాత్ర జోష్‌తో సాగింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే గత నెల 23వ తేదీన కడప జిల్లాలో యువగళం పాదయాత్ర మొదలైన నాటి నుంచి వస్తున్న స్పందన… సాగుతున్న తీరును కచ్చితంగా విశ్లేషించాల్సిందే. కడప జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. మొదటి నుంచి వైఎస్ కుటుంబ ఆధిపత్యం ఉండే జిల్లాగా కడపను అంతా చూస్తారు.

అయితే అలాంటి చోట రెండు వారాలుగా జరుగుతున్న నారా లోకేష్ యవగళం పాదయాత్రం నిజంగానే వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నదని, ఆలోచింపచేస్తోందని, ఆందోళనలోకి నెట్టేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత నెల 23వ తేదీన కడప జిల్లాలో మొదలై జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం మీదుగా సాగుతున్న యాత్ర ప్రతి పక్ష టీడీపీలోనే కాదు.. అధికార వైసీపీలోను ఇప్పుడు చర్చగా మారుతున్నది. అటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగుతున్న పాదయాత్రకు చూసుకున్నా…ఇటు మీటింగ్ లకు చూసుకున్నా జనం పోటెత్తుతున్నారు.

వీళ్లంతా కార్యకర్తలు మాత్రమే అనుకోవడానికి లేదని యాత్ర జరుగుతున్న తీరును చూస్తే అర్థం అవుతున్నది. పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నవారిలో.. యువగళంపై ఆసక్తి చూపుతున్నవారిలో యవత, మహిళలతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు కేవలం తెలుగు దేశం కార్యకర్తలతోనే సాగుతున్న యాత్ర అని వైసీపీ లెక్కలు వేసుకుని సర్దిచెప్పుకొంటే మాత్రం వారిని వారు మోసం చేసుకుంటున్నట్లే.

లోకేష్‌పై మాటల దాటి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సృష్టించిన సమస్యలు మొదట్లో యాత్రకు కొంత అటెన్షన్ తెచ్చాయి. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని లోకేష్ చెప్పినట్లే.. అధికార పార్టీ చర్యలు, పోకడలు, అడ్డంకులు యాత్రకు పరోక్షంగా ఫోకస్ తెచ్చిపెట్టాయి. తెలుగు దేశం పార్టీ బలంగా ఉండే అనంతపురంలో జనం వచ్చారు అంటే అర్థం ఉంది.. టీడీపీ వీక్ అని అంతా భావించే కడప జిల్లాలోనే యువగళం పీక్ లో సాగడం మాత్రం నిజంగా వైసీపీకి చెమటలుపట్టించే అంశమే.

వివేకా హత్య విషయంలో నిజం ఏంటి? అనేది కడప జిల్లా వాసులకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌కు నైతిక ఇబ్బంది కలిగిస్తున్నాయేమో గానీ.. కడపలో మాత్రం హత్య విషయంలో స్థానికులకు ఎప్పుడో స్పష్టత ఉంది. ఇక్కడ జగన్‌కు జరగాల్సిన డామేజ్ ఎప్పుడో జరిగిపోయింది.

అయితే కడపలో లోకేష్ వివేకా హత్య విషయాన్ని సూటిగా ప్రస్తావించి.. జగన్‌ను ప్రశ్నించి, ఆయనకు అసౌకర్య వాతావరణం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. సీఎంగా కడపకు జగన్ ఏం చేశాడు? అని ప్రశ్నించడం ద్వారా జిల్లా వాసుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాలు, ఇరిగేషన్ వంటి స్థానిక సమస్యల ప్రస్తావన ద్వారా సభకు వచ్చిన వారినే కాదు.. కరుడుగట్టిన వైసీపీ వాళ్లను సైతం ఆలోచనలో పడేసేలా ఉంటున్నాయి. కర్నూలు జిల్లాలో వైఎస్ స్మృతి వనం వద్ద నమస్కరించడం ద్వారా పరిణితి చాటుకున్న లోకేష్.. తండ్రి వర్థంతికి, జయంతికి జగన్ కడప జిల్లాకు రావడం తప్ప జిల్లాకు ఏం చేశాడు? అని ప్రశ్నించడం ద్వారా మరింత సూటిగా దాడి చేశారు.

మొత్తంగా చూసుకుంటే రెండు వారాలుగా కడప జిల్లాలో సాగుతున్న లోకేష్ యువగళం మాత్రం కొత్త చర్చకు, వైసీపీలో కలవరానికి కారణం అవుతున్నది. వైసీపీ పెద్దలకు అధికారం తెచ్చి పెట్టిన అహంకారం.. ఇప్పుడు లోపల ఉన్న అలజడిని, ఆందోళనను మరుగున పడేయవచ్చేమో గానీ.. కడప యువగళం గర్జనను మాత్రం తగ్గించలేదు. అక్కడ వచ్చిన మార్పును మరుగున పడేయలేదు.

Latest News