చత్తీస్ఘడ్ రాష్ట్రం దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య
విధాత : చత్తీస్ఘడ్ రాష్ట్రం దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య సాగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెకేమేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లుగా పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్టీజీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి, సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. వారిని గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ఏడుగురు మావోయిస్టులను కాల్చిచంపాయి. ఎన్కౌంటర్ ఘటన నుంచి మరికొందరు నక్సల్స్ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.. ఇటీవలే కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన ఆగ్ర నేతలతోపాటు 29 మంది మరణించారు. ఆ వెంటనే మరో ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులను కోల్పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది.