పాట్నా : భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్(72) మోదీ ఇక లేరు. క్యాన్సర్తో బాధపడుతున్న సుశీల్ కుమార్( Sushil Kumar Modi) సోమవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు పేర్కొన్నారు.
సుశీల్ కుమార్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సుశీల్ కుమార్ మోదీ అంత్యక్రియలు మంగళవారం పాట్నాలో రాజేంద్ర నగర్లో నిర్వహించనున్నారు.
భారతీయ జనతా పార్టీలో సుశీల్ కుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినప్పుడు తనకు క్యాన్సర్ ఉందని, దాంతో పోరాడుతున్నానని ఈ ఏడాది ఏప్రిల్లో సుశీల్ కుమార్ మోదీ వెల్లడించారు.
సుశీల్ కుమార్ మోదీ 1952, జనవరి 5వ తేదీన జన్మించారు. పాట్నా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. పాట్నా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పని చేశారు. 1973లో నిర్వహించిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో సుశీల్ కుమార్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
మూడు దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు ఆయన. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. 2005 నుంచి 2013 వరకు, 2017 నుంచి 2020 వరకు బీహార్ డిప్యూటీ సీఎంగా సేవలందించారు. 1990లో పాట్నా సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 2004 వరకు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2004లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భగల్పూర్ నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఏడాది కాలం మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు. ఎందుకంటే బీహార్ డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశం వచ్చింది. దీంతో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా పదవి పొందారు.