Liquor Policy Case | లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌

లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ సోమవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇదే లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం గమనార్హం.

Liquor Policy Case | లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ సోమవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇదే లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టులోని స్పెషల్‌ సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.
ఈడీ కేసులో తీహార్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్‌ పాలసీలో అవినీతి అంశంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ఈ అంశంలో మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన.. అనంతరం రద్దు చేసిన లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు తీహార్‌ జైల్లో కేజ్రీవాల్‌ను జూన్‌ 26న అరెస్టు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌తోపాటు ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా, బీఆరెస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా నిందితులుగా ఉన్నారు. ఈడీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులలో మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించనున్నది.