ఐదు శతాబ్దాల అనంతరం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడి జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో బాల రాముడు దర్శనమిచ్చారు
Ayodhya | ఐదు శతాబ్దాల అనంతరం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడి జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో బాల రాముడు దర్శనమిచ్చారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రాముడి దర్శనం కల్పిస్తామని అయోధ్య ట్రస్ట్ ప్రకటించింది.
ఈ క్రమంలో మంగళవారం వేకువ జాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామ్లల్లా దర్శనం కోసం తరలివచ్చారు. భక్తులందరికీ నవ్య రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. తాత్కాలిక ఆలయంలో ప్రతిష్టించిన రాంలాలా దర్శనం ఈ నెల 20న రామ్లల్లా దర్శనాలను నిలిపివేశారు.
ఈ విగ్రహాన్ని సైతం కొత్తగా నిర్మించిన మందిరంలో ప్రతిష్టించారు. గర్భాలయంలో రెండు విగ్రహాలను భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అయోధ్య రాముడి దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి మొదలవుతాయి. రెండు విడుతలుగా దర్శనం కల్పించనున్నారు.
తొలి విడదతలో ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, రెండో విడుదలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6.30 గంటల వరకు దర్శనాలుంటాయి. అయితే, భక్తుల రద్దీ పెరిగితే దర్శనాల సమయాన్ని పొడిగించనున్నారు. సోమవారం సామాన్య భక్తులు దర్శనం చేసుకోలేకపోయారు. కేవలం ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించిన ప్రత్యేక అతిథులకు మాత్రమే దర్శనాలు కల్పించారు.
రోజుకో అలంకరణ..
రామ్లల్లా రోజుకో అలంకరణలో కనిపించనున్నారు. పూరీ, రబ్రీ-ఖీర్, పాలు, పేడా, పండ్లు నైవేద్యంగా సమర్పించనున్నారు. రామ్లల్లా సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలను అలంకరించనుండగా.. ప్రత్యేక రోజుల్లో పసుపు రంగు వస్త్రాలను అలంకరించనున్నారు.
బాల రాముడికి రోజుకు ఆరుసార్లు హారతి ఇస్తారు. హారతికి హాజరయ్యే భక్తులకు పాస్లు జారీ చేయనున్నారు. అయోధ్య క్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై మంగళ, శృంగార, భోగ్, ఉత్థాపన్, సంధ్యాహారతి, శయన హారతి ఉంటాయని ఆచార్య మిథిలేల్ నందిని శరణ్ తెలిపారు. ఉత్తపన్ హారతితో స్వామివారిని మేల్కొలిపి.. స్వామివారి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తారు.