• Telugu News
  • /National

Pollution Affect | ఢిల్లీలో లాక్‌డౌన్‌? ఆన్‌లైన్‌లోనే క్లాసుల బోధన!

కాలుష్యం తీవ్రత ఢిల్లీ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేయనున్నారు. పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు బోధించనున్నారు.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Apr 01, 2026, 8:19 pm IST
Read Time: 5 mins
Pollution Affect | ఢిల్లీలో లాక్‌డౌన్‌? ఆన్‌లైన్‌లోనే క్లాసుల బోధన!

(జగన్మోహన్‌ తాళ్లూరి)

Pollution Affect | దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం కోరలు చాస్తోంది. దీంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజిమెంట్.. ఢిల్లీఎన్సీఆర్‌ పరిధిలో గ్రాప్‌ స్టేజ్ 4 (GRAP Stage 4) పరిమితులను విధించింది. సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) ప్రకారం శనివారం సాయంత్రం 431 మార్కు దాటడంతో కఠిన చర్యలకు సిద్ధమైంది. సోమవారం నుంచి విద్యా సంస్థలు, నిర్మాణ రంగం కార్యకలాపాలు, కమర్షియల్ వాహనాలు నిలిపివేయాలనే యోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై ఢిల్లీ ప్రభుత్వం తన అధికారిక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కొవిడ్ సమయంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు ఇంటినుంచే పనిచేసుకునే వెసులుబాటును కంపెనీలు కల్పించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఢిల్లీ మహానగరంలో అమలు చేసే సూచనలు సుస్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఐదో తరగతి విద్యార్థులకు హైబ్రిడ్ క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. ఆన్‌లైన్‌ లేదా విద్యా సంస్థలకు ప్రత్యక్ష హాజరులో ఏది బాగుంటే దాన్ని అమలు చేయాలని సూచించింది. కాలుష్యం తీవ్రత 431కు చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 12వ తరగతి విద్యార్థుల వరకు ప్రత్యక్ష హాజరును రద్ధు చేసి ఆన్‌లైన్‌ క్లాసులను మాత్రమే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిందంటున్నారు. విద్యా సంస్థలు, కాలేజీలు, అత్యవసరం కాని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలనే యోచనలో కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం అధికంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజిమెంట్ గత నెల రోజులుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నది.

ప్రధాన రోడ్లపై మట్టి కుప్పలు, చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు వాల్ టూ వాల్ రోడ్డు నిర్మాణం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మట్టి కుప్పలు, చెత్తాచెదారం మూలంగానే వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించింది. వాల్ టూ వాల్ విధానం మూలంగా చాలా వరకు దుమ్ము సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రజల్లో కూడా చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాల పారబోతపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నది.

Read Also |

International Airport | బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌! వచ్చేది అక్కడే!
Winter Heaters Risk | చలికాలంలో ఇళ్లలో హీటర్స్‌ వాడటం ఎంత సేఫ్‌?
Most Expensive Whisky | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 8 లిక్కర్లు.. రూ.256 కోట్ల వరకు..