Rajkot Game Zone Fire | గుజరాత్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో 32కు చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు.

గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. కాగా మంటలు చెలరేగుతున్న సమయంలో కొందరు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయట పడ్డారు. పిల్లలు గేమ్స్ ఆడుతుండగా గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. బయటకు రావడానికి అంతా ప్రయత్నిస్తుండగానే గేమ్జోన్ భవనం అంతా పొగతో నిండిపోయింది. దాంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఏమవుతుందో అర్థం కాలేదు. వెనుక గేటు నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ కూడా మంటలు చెలరేగాయి. దాంతో వేరే దారి లేక కొందరు కిటికీ నుంచి దూకేశారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం, పైకప్పు కూలిపోవడంతో వారంతా బయటకు రావడంలో ఆవరోధంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 70మంది వరకు పిల్లలు అక్కడ ఉన్నారని, దాదాపు 300మందికి పైగా ప్రజలు గేమ్ జోన్లో ఉన్నారని రాజ్కోట్ అగ్నిమాపక అధికారి ఇలేష్ ఖేర్ తెలిపారు. కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని వాటిని డీఎన్ఏ టెస్టుకు పంపామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రాజ్ కోట్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం అనంతరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. అగ్నిప్రమాద ఘటన జరిగిన టీఆర్పి గేమ్ జోన్ ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్ ను నియమించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు గేమింగ్ జోన్ యాజమాని యువరాజ్ సింగ్ సోలంకి, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడి కావాల్సిన సహాయక చర్యలు చేపట్టాలని, దోషులను శిక్షించాలని మోదీ సూచించారు.