మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ

మామిడి తోటల పునరుజ్జీవనానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త ప్రూనింగ్ యంత్రాన్ని పరిచయం చేశారు. దీంతో దిగుబడి పెరగడంతో పాటు రైతుల ఖర్చులు తగ్గనున్నాయి.

మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ

పంటల సాగులో నూతన టెక్నాలాజీతో కూడిన ఆధునిక యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్సహం ప్రదర్శిస్తుంటారు. ఇటీవల పత్తి కోత యంత్రం, కొబ్బరి కాయల కోత యంత్రాలను ఆవిష్కరించిన చౌహాన్ తాజాగా మామిడి తోటల సాగులో భారీగా పెరిగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించే ‘ప్రూనింగ్ యంత్రం’ ను రైతులకు పరిఛయం చేశారు.

లక్నోలో ఉన్న ICAR – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (CISH) వద్ద పాత మామిడి తోటలను పునరుజ్జీవింపజేసే ఆధునిక యంత్రం పనితీరును ఆయన పరిశీలించారు. 70 అడుగుల నుండి 16 అడుగులకు కత్తిరించిన పాత చెట్టుల కత్తిరింపు పనుల ప్రదర్శినను ఆయన తిలకించారు. ‘ప్రూనింగ్ యంత్రం’ (కొమ్మలు కత్తిరించే యంత్రం) సహాయంతో వయసు పైబడిన భారీ వృక్షాల పరిమాణాన్ని తగ్గించేందుకు వాటిని కత్తిరించడం, సవరించడం పనులలో యంత్రం పనితీరును స్వయంగా దానిని నడిపి పరిశీలించారు. ఫ్రూనింగ్ యంత్రం వినియోగంతో ఆ చెట్ల నుండి తిరిగి మెరుగైన నాణ్యత గల పండ్లు, అధిక దిగుబడి లభిస్తాయని, అదే సమయంలో ఈ పనులలో అయ్యే ఖర్చు, పిచికారీ ఖర్చులు, సమయం కూడా రైతులకు తగ్గుతుందని చౌహాన్ తెలిపారు. భారతదేశం అంతటా తోటల పునరుజ్జీవనంలో దీనిని విస్తృతంగా వినియోగించేలా కస్టమ్ హైరింగ్ కేంద్రాల కోసం రూ. 32 లక్షల విలువైన ఈ యంత్రాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ఇదే రోజు ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (CISH)లో మామిడి పండ్లను కీటకాలు, ఈగలు, మచ్చల నుండి రక్షించే బ్యాగింగ్ పద్ధతిని కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ పద్ధతి పండ్లను సురక్షితంగా ఉంచుతుందని, వాటి నాణ్యతను మెరుగుపరిచి రైతులకు మంచి ధరలు పొందడంలో సహాయపడుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

King Cobra | హైద‌రాబాద్‌కు అల‌వాటు ప‌డ్డ నాగుపాములు..! చంపొద్దంటున్న ల‌వ‌ర్స్‌..!!
Vivo | వివో నుంచి X300 Ultra, X300 FE లాంచ్.. ధర ఎంతంటే..!