పిల్ల జోలికొస్తే…మంటలకైనా ఎదురెళ్లాల్సిందేనన్న ఏనుగు!

తన పిల్ల జోలికొస్తే...మంటలకైనా ఎదురెళ్లాల్సిందేనంటూ ఓ తల్లి ఏనుగు మండుతున్న కాగడాలతో తమను తరిమివేయాలని చూసిన మనుషులపైనే ఎదురుదాడి చేసింది. మంటలకు భయపడే ఏనుగు.. పిల్ల ఏనుగు కోసం కాగడాలు పట్టుకున్న మనుషులనే తరుముతూ వారిని పరుగులు పెట్టించిన వీడియో వైరల్ గా మారింది.

విధాత : వన్యప్రాణులలో బలంతో పాటు తెలివైన జంతువులలో ఏనుగు అగ్రగామిగా వ్యవహరిస్తుంది. సమూహాలుగా సంచరించే ఏనుగులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపుకాస్తుంటాయి. ప్రకృతి విపత్తుల సమయాలలో, దాడులు ఎదురైన సందర్బాలలో ఏనుగుల గుంపు పిల్ల ఏనుగుల చుట్టు రక్షణ వలయంగా మోహరిస్తుంటాయి.
మరోవైపు తరిగిపోతున్న అడవుల నేపథ్యంలో తరుచూ ఏనుగుల గుంపులు అటవీ సమీప పొలాలు, గ్రామాలలోకి ప్రవేశిస్తూ పంటలను స్వాహా చేస్తూ…మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అలా పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును తరిమేందుకు రైతులు మండుతున్న కాగడాలు, భారీ శబ్ధాలతో భయపెట్టే ప్రయత్నం చేశారు. సహజంగా ఏనుగులు, వన్యప్రాణులు మంటలను చూసి దూరంగా పారిపోతుంటాయి. అయితే ఏనుగుల గుంపు సైతం తొలుత రైతులు చేతుల్లోని కాగడాలను చూసి పంట పొలాలను వీడి దూరంగా వెల్తున్నాయి.

అయితే ఓ పిల్ల ఏనుగు ఈ గందరగోళం మధ్య భయపడిపోవడంతో తల్లి ఏనుగు ఆగ్రహించింది. అంతే ఒక్కసారిగా కాగడాల మంటలను సైతం లెక్కచేయకుండా..వెనక్కి పరుగెత్తుకొచ్చి రైతుల మీదకు దూసుకొచ్చింది. వారిపై దాడి చేసి అందరిని పరుగులు పెట్టించింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కాగా…పిల్ల జొలికొస్తే తల్లి ఏనుగులు, ఏనుగుల గుంపులు ఎంత తీవ్రంగా స్పందిస్తాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Latest News